మరో నలుగురి అన్నదాతల ఆత్మహత్య
హైదరాబాద్,సెప్టెంబర్22(జనంసాక్షి):
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగటం లేదు. మంగళవారం నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం దాసరిపల్లిలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్ అనే రైతు అప్పుల బాధ తాళలేక పొలం వద్దనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆముదం, వరి పంట సాగుచేసి వెంకటేశ్ తీవ్రంగా నష్టపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.వరంగల్ జిల్లా జనగాం మండలం మరిగడి శివారు టోక్యతండాలో విషాదం నెలకొంది. అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు శంకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రెండెకరాల్లో పత్తి, మూడెకరాల్లో వరి పంట వేసి శంకర్ తీవ్రంగా నష్టపోయాడని, పంటల సాగు కోసం రూ.3లక్షల వరకు అప్పులు చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం సహబత్తాపూర్లో మరో రైతు లొంక ఆశయ్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం దాసరిపల్లిలో చెట్టుకు ఉరి వేసుకొని మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం జర్పులతండాలో అప్పుల బాధతో రైతు హరిలాల్ కరెంట్ వైర్లు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో విద్యుత్ తీగలు పట్టుకుని రైతు హరి(30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 10 ఎకరాల్లో పత్తిపంట సాగుచేసిన హరి ..వర్షాలు లేక పోవడంతో దిగాలు చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పత్తిపంట సాగుకోసం రూ.4లక్షలు అప్పు చేసినట్లు హరి కుటుంబ సభ్యులు తెలిపారు.