మహాకూటమి మాటలు నమ్మవద్దు


– సబ్బండ వర్ణాల అభివృద్ధే కేసీఆర్‌ లక్ష్యం
– మరోసారి అవకాశం ఇచ్చి అభివృద్ధికి తోడ్పాటునివ్వండి
– ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
– నిర్మల్‌ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆపద్ధర్మ మంత్రి
నిర్మల్‌, నవంబర్‌6(జ‌నంసాక్షి) :  అపవిత్ర పొత్తులతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు మహాకూటమితో వస్తున్నారని, కూటమి మాటలు నమ్మి మోసపోకుండా.. వారి కుట్రలను తిప్పికొట్టాలని ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం నిర్మల్‌ పట్టణంలోఇంద్రకరణ్‌ రెడ్డి విస్తృత ప్రచారం చేపట్టారు. మంత్రి ఇంద్రకరణ్‌ మొదట షేక్‌ షాపేట్‌ కాలనీలోని
షేక్‌ షావలి దర్గాలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ మాట్లాడుతూ..మహాకూటమి మాటలు నమ్మవద్దన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలతో నిర్మల్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. తనను మళ్లీ గెలిపిస్తే నిర్మల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు.
సీఎం ప్రవేశపెట్టిన పథకాలతో పాటు నిర్మల్‌  నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. మళ్లీ గెలిపిస్తే నిర్మల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు.
సబ్బండవర్ణాల సంక్షేమం కోసం కేసీఆర్‌ ప్రభుత్వం దృఢసంకల్పంతో పనిచేస్తున్నదని పేర్కొన్నారు. మిషన్‌భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందించిన మహనీయుడు కేసీఆర్‌ అని, ఒక్కొక్కరికి ఆరుకిలోల బియ్యం, రూ.1000 పింఛన్‌ అందించి పేదల ఆకలి సమస్య తీర్చిన గొప్పవ్యక్తి అని తెలిపారు. గర్భిణులకు ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా కాన్పుచేసి, కేసీఆర్‌ కిట్స్‌, రూ.12 వేల నగదు అందించడమే కాకుండా.. నయాపైసా ఖర్చులేకుండా ఇంటివద్ద దింపారని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో ఆడబిడ్డ పెండ్లికి రూ. లక్షా16లు ఇచ్చి పేద కుటుంబాలకు కేసీఆర్‌ బాసటగా నిలిచారన్నారు. పొలానికి నీరు వాడుకోలేని రైతు వ్యథకు పరిష్కారం చూపుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి నీరందించే బృహత్‌ ప్రణాళికతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం పూర్తయితే 46 వేల చెరువులు, కుంటలను నింపడంతో తెలంగాణ సస్యశ్యామలం కావడమే కాకుండా ముదిరాజ్‌లకు, మత్య్సకారులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, చేతినిండా పని, కడుపు నిండా తిండి దొరుకుతుందని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంట్‌, మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నల్లా నీళ్లు, కాళేశ్వరంతో ప్రతి ఎకరానికి సాగునీరిచ్చే కేసీఆర్‌పై జనం విశ్వాసంతో ఉన్నారన్నారు.