‘మహా’ నాటకంపై తీర్పు నేడే

– రాత్రికిరాత్రే రాష్ట్రపతిపాలన ఎత్తివేయాలా

– 24గంటల్లో అసెంబ్లీలో బలపరీక్ష జరిపించండి

– సుప్రీంలో కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన వాదనలు

– బలపరీక్షకు 15రోజుల సమయం ఇవ్వాలన్న బీజేపీ తరపు న్యాయవాది

న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జనంసాక్షి):మహారాష్ట్ర ఫడణవీస్‌ ప్రభుత్వం ఏర్పాటు వ్యవహారంలో తక్షణమే బలపరీక్ష నిర్వహించాలన్న వాజ్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం తీర్పును మంగళవారంకు వాయిదావస్తూ నిర్ణయించింది. మంగళవారం ఉదయం 10.30గంటలకు తీర్పును వెలువరిస్తామని పేర్కొంది. దీంతో సీఎం ఫడణవీస్‌కు బలపరీక్షపై మరో 24గంటల ఊరట లభించినట్లయింది. విచారణ ప్రారంభమైన వెంటనే తొలుత మహారాష్ట్ర అంశంపై సోమవారం సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫడ్నవీస్‌కు మెజార్టీ ఉంటే 24గంటల్లోగా బలం నిరూపించుకోవాలని జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సంజయ్‌ ఖన్నా, జస్టిస్‌ భూషణ్‌ ధర్మాసనం వ్యాఖ్యానించింది. మెజార్టీని రాజ్‌భవన్‌ నిర్ణయించలేదని, అసెంబ్లీలో మాత్రమే జరగాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ఫిరాయింపులను నిరోధించాలంటే తక్షణమే బలపరీక్షను నిర్వహించాలని కోరింది. ఫడ్నవీస్‌కు మెజార్టీ ఉందా, గతంలో 24 గంటల్లోనే బలపరీక్ష నిర్వహించిన సందర్భాలున్నాయని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వ్యాఖ్యానించారు. కోర్టుకు ఇచ్చిన మద్దతు లేఖలు మరాఠాలో ఉన్నాయని, వాటిని అనువాదం చేయాలని ఆదేశించారు. తొలుత ఆదివారం నాటి ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారో చెప్పే లేఖలను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనకు మెజార్టీ ఉందని సీఎం ఫడ్నవీస్‌ సమర్పించిన లేఖ, ఎన్సీపీ

ఎమ్మెల్యేల సంతకాలతో శాసనసభాపక్ష నేత ¬దాలో అజిత్‌ పవార్‌ సమర్పించిన లేఖను సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించడం సరైన నిర్ణయమేనని, ఈ లేఖలపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఆయనకు లేదని సొలిసిటర్‌ జనరల్‌ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలు విఫలమైన తర్వాతే రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫార్పు చేశారని, ఆ తర్వాత నవంబరు 22న ఎన్సీపీ శాసనసభా పక్ష నేత అజిత్‌ పవార్‌ 54మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న లేఖను గవర్నర్‌కు సమర్పించారని తెలిపారు. అనంతరం తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని దేవేంద్ర ఫడణవీస్‌ గవర్నర్‌ను కోరారని, ఫడణవీస్‌, అజిత్‌ పవార్‌ మద్దతు లేఖల ఆధారంగా గవర్నర్‌ వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని తుషార్‌ మెహతా తెలిపారు. ఇందుకు సంబంధించిన రెండు లేఖలను కోర్టుకు సమర్పించారు. అనంతరం సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. ఎన్నికల ముందు మాతో ఉన్న శివసేన తప్పుకోవడం వల్లే రాష్ట్రపతి పాలన వచ్చింది. ఆ తర్వాత మద్దతు ఇచ్చేందుకు అజిత్‌ పవార్‌ ముందుకొచ్చారన్నారు. ఒక పవార్‌ మా వైపు ఉన్నారు. ఒక పవార్‌ వారివైపు ఉన్నారని, వారి మధ్య ఉన్న కుటుంబ కలహాలతో మాకు సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. భాజపాకు మద్దతిస్తున్నట్లు అజిత్‌ పవార్‌ 54మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న లేఖను సమర్పించారు. దాని ఆధారంగానే గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని, సంతకాలు ఫోర్జరీ చేశారని ఎన్సీపీ నేతలు చెప్పట్లేదని అన్నారు. బలపరీక్షకు సమయం ఇవ్వడం అనేది గవర్నర్‌ విచక్షణాధికారమని, దాన్ని ఎలా ప్రశ్నిస్తారని, ఇంత సమయంలోనే బలపరీక్షకు ఆదేశించాలని కోర్టు చెబుతుందా అని ప్రశ్నించారు. గవర్నర్‌ నిర్ణయం న్యాయసవిూక్ష పరిధిలోకి రాదని రోహత్గీ వాదించారు. అనంతరం ఎన్సీపీనేత అజిత్‌ పవార్‌ తరఫు న్యాయవాది మనీందర్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. మా జాబితా చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా, వాస్తవికంగా సరైందని, భాజపాకు మద్దతివ్వాలనే అధికారం పార్టీ అజిత్‌ పవార్‌కు కల్పించిందని అన్నారు. ఎన్సీపీ శాసనసభాపక్ష అధినేతగా అజిత్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని, మా లేఖ ఆధారంగానే గవర్నర్‌ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించారని తెలిపారు.

రాత్రికి రాత్రే రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలా..?

ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ‘తెల్లవారుజామున 5.27గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తివేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. మూడు పార్టీల ప్రభుత్వం ఏర్పడకుండా ఇలా వ్యవహరించారని, అత్యవసర నిర్ణయాలకు కారణాలు కూడా చూపించలేదన్నారు. భాజపా-శివసేన మధ్య పొత్తు బెడిసికొట్టిందని, దీంతో కాంగ్రెస్‌, ఎన్సీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు 54మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్‌ పవార్‌ అంటున్నారని, కానీ ఎన్సీపీ తరఫున అజిత్‌ పవార్‌ ప్రాతినిధ్యం వహించట్లేదని తెలిపే అఫిడవిట్లు కోర్టుకు సమర్పించామన్నారు. ఆయనను శాసనసభా పక్ష పదవి నుంచి తొలగించారని, భాజపాకు సంఖ్యా బలం ఉంటే 24గంటల్లోగా మెజార్టీ నిరూపించుకోవాలని, తక్షణమే బలపరీక్ష జరిపేలా ఆదేశాలివ్వాలని కోర్టును కపిల్‌ సిబల్‌ కోరారు. అనంతరం ఎన్సీపీ, కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇది చాలా మోసపూరిత చర్య అన్నారు. భాజపాకు మద్దతిస్తామని ఒక్క ఎన్సీపీ ఎమ్మెల్యే అయినా అజిత్‌ పవార్‌కు చెప్పారా అని ప్రశ్నించారు. అజిత్‌ పవార్‌ సమర్పించిన లేఖలో భాజపాకు మద్దతిస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. అది కేవలం 54 మంది ఎమ్మెల్యేల సంతకాల జాబితా మాత్రమే.

శాసనసభలో బలాన్ని నిరూపించుకునేందుకు రెండు పక్షాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మెజార్టీ ఉందని భాజపా కూడా చెబుతోందని, అలాంటప్పుడు బలపరీక్షపై ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. దాన్ని ఎందుకు వాయిదా వేయాలనుకుంటున్నారని, తక్షణమే బలపరీక్ష జరపాలని సింఘ్వీ వాదించారు.