మహిళలు అన్ని రంగాల్లో శక్తివంతంగా ఎదగాలి

3

– ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,మార్చి6(జనంసాక్షి):మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఇవాళ రెండో రోజు జరుగుతోన్న మహిళా ప్రజా ప్రతినిధుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. అన్ని రంగాల్లో మహిళలు తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకుంటున్నారని పేర్కొన్నారు. అనేక రంగాల్లో మహిళలు శక్తివంతంగా ఎదగడం దేశానికే గర్వకారణమన్నారు. మహిళా ప్రజా ప్రతినిధుల సదస్సులో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను అభినందించారు. ఈ సదస్సులో పొందే అనుభవాలు సమావేశాల్లో పొందే జ్ఞానం కంటే ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అభిప్రాయాలు పంచుకునే అవకాశం దక్కుతుందన్నారు. గతంలో మహిళా స్పీకర్‌, మహిళా విదేశాంగ మంత్రి అంటే ఎవరో తెలియని స్థితి ఉండేదన్నారు. ఎన్డీఏ హయాంలో స్పీకర్‌, విదేశాంగ మంత్రి మహిళలే ఉన్నారని వివరించారు.