మహిళా రేషన్ డీలర్ దారుణ హత్య

మహిళా రేషన్ డీలర్ దారుణ హత్యజనంసాక్షి, మంథని, అక్టోబర్ 11: పెద్దపల్లి జిల్లా మంథనిలో దారుణం చోటుచేసుకుంది. మంథని మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మహిళా రేషన్ డీలర్ బందెల రాజమణి (37) హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని ఎరుకలగూడెంలో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగినట్లు భావిస్తున్నారు. ఆటో డ్రైవర్ పైడాకుల సంతోష్ ఇంట్లో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మంథని మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బందెల రాజమణి (37) రేషన్ డీలర్ గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. రేషన్ డీలర్ గా పని చేసిన భర్త రమేష్ నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. కాగా తర్వాత రాజమణి రేషన్ డీలర్ గా రేషన్ షాప్ కు సరుకులు తీసుకొచ్చే పైడాకుల సంతోష్ అనే ఆటో డ్రైవర్ తో రాజమణికి పరిచయం ఏర్పడింది. సంతోష్ తరచూ రాజమణి ఇంటికి వెళ్లేవాడు. రాజమణిని సంతోష్ వేధించడంతో ఇరువురు కొంతకాలంగా మాట్లాడుకోవడం లేదు. ఇదిలా ఉంటే రాజమణి సోమవారం సాయంత్రం సరుకుల కోసం మంథనికి వెళ్తున్నాను అంటూ ఇంట్లో పిల్లలకు చెప్పి బయలుదేరింది. తర్వాత ఇంటికి రాకపోవడంతో పిల్లలు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ఈ క్రమంలో మంథని ఎరుకల గూడెంలో పైడాకుల సంతోష్ అద్దె ఇంట్లో రాజమణి మృతదేహాన్ని గుర్తించారు. రాజమణిని వేధించడంతో ఆమె తనను తిరస్కరించిందనే క్రమంలో సంతోష్ హత్య చేసినట్లు మృతురాలు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతోష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంథని సీఐ సతీష్ తెలిపారు.