మాజీ ఎయిర్ఫోర్స్ చీఫ్ ఎస్పీ త్యాగి అరెస్ట్
అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంలో మాజీ ఎయిర్ఫోర్స్ చీఫ్ ఎస్పీ త్యాగిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ఢిల్లీకి చెందిన లాయర్ గౌతమ్ ఖైతాన్, సంజీవ్ త్యాగిలను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని శనివారం కోర్టులో హాజరుపరచనున్నారు. దేశ చరిత్రలో ఓ మాజీ సర్విస్ చీఫ్ను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో అక్రమాలకు సంబంధించి ఈ ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు విషయంలో ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు లంచం తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో మాజీ ఎయిర్చీఫ్ ఎస్పీ త్యాగి పాత్రపై అనుమానాలు ఉన్నాయి. అగస్టా వెస్ట్ల్యాండ్ రూ.3600 కోట్ల విలువైన కాంట్రాక్ట్ను సొంతం చేసుకోవడంలో త్యాగి పాత్రే కీలకమని ఇటలీ, ఇండియాలోని విచారణాధికారులు ఆరోపించారు.