మాయావతికి మరో షాక్‌


పార్టీ జాతీయ కార్యదర్శి రాజీనామా
లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతికి మరో షాక్‌ తగిలింది. బీఎస్పీ నుంచి మరో కీలక వ్యక్తి పార్టీకి దూరమయ్యారు.దాదాపు 35 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసిన బీఎస్పీ జాతీయ కార్యదర్శి పరందేవ్‌ యాదవ్‌ తన పదవికి రాజీనామా చేశారు. గత నెల రోజుల వ్యవధిలో నలుగురు ముఖ్య నేతలు పార్టీని వీడటం గమనార్హం.

బీఎస్పీ సీనియర్‌ నేతలు స్వామి ప్రసాద్‌ మౌర్య, ఆర్‌కే చౌదరి, రవీంద్రనాథ్‌ త్రిపాఠి ఇటీవలే పార్టీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ జాతీయ కార్యదర్శి పరందేవ్‌ కూడా రాజీనామా చేశారు. పార్టీ ఓ కిరాణాకొట్టుగా మారిపోయిందని.. డబ్బుంటే పార్టీలో టిక్కెట్ల నుంచి పదవుల దాకా అన్నీ దక్కుతాయని పరందేవ్‌ ఆరోపించారు. తనలాంటి అంకితభావం కలిగిన నేతలను పక్కనబెట్టి ఎటువంటి విధేయత లేని వారిని ఎమ్మెల్సీలను చేస్తున్నారని విమర్శించారు.తాను ఇక వారణాశికి వెళ్లిపోతున్నానని చెప్పారు. వారణాశి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్‌ నియోజకవర్గం కావడంతో.. పరందేవ్‌ త్వరలోనే భాజపాలో చేరుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.