మాల్యాకు మరోమారు ఇడి నోటీసులు

న్యూదిల్లీ,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): బ్యాంకులకు రుణాలు ఎగవేసి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. ఏప్రిల్‌ 9లోగా తమ వద్ద విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది. అయితే విజయ్‌ మాల్యా ఈడీ ముందు హాజరవడానికి మే నెల వరకు సమయం కోరుతున్నారు. ఇప్పటికి మూడు సార్లు ఈడీ విజయ్‌ మాల్యాకు సమన్లు జారీ చేసింది.మాల్యా బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల రుణాన్ని చెల్లించడం లేదని ఆయనపై నమోదైన కేసులు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. మాల్యాపై పలు మనీలాండరింగ్‌ కేసులు ఉన్నాయి. మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబరులోగా బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.4వేల కోట్లు చెల్లిస్తానని అప్పటి దాకా సమయం ఇవ్వాలని ఆయన ఇటీవల న్యాయస్థానాన్ని కోరారు.