మాల్యా విల్లాను సొంతం చేసుకున్న తెలుగు హీరో

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విల్లాను సొంతం చేసుకున్నాడు సినీ హీరో సచిన్ జోషీ. గోవాలో ఉన్న విలాసవంతమైన కింగ్ ఫిషర్ విల్లాను రిజర్వ ధర 73 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి కొనుక్కోవడానికి ముందుకొచ్చాడు. ఈ విషయాన్ని ధ్రువీకరించారు SBI చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య. మాల్యా రుణాలను రికవరీ చేసేందుకుగాను గోవాలోని దీన్ని వేలానికి ఉంచారు. కండోలిమ్‌లో అరేబియా సముద్రానికి ఎదురుగా ఉంటుంది ఈ విల్లా. ఈ విలాసవంతమైన విల్లాలో అన్ని రకాల సదుపాయాలు, వసతులు ఉన్నాయి. వేలంలో ఈ విల్లాను కొనుగోలు చేసేందుకు కొందరు ఆసక్తి చూపినా రిజర్వ్ ధర చెల్లించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పలుమార్లు నిర్వహించిన వేలంలో రిజర్వ్ ధరను 85 కోట్ల నుంచి 81 కోట్లకు, చివరకు 73 కోట్ల రూపాయలకు తగ్గించారు. చివరకు ఈ విల్లాను సచిన్ జోషి సొంతం చేసుకున్నారు. జేఎంజే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైస్ చైర్మన్‌ హోదాలో జోషి ఫిట్‌నెస్ సెంటర్ల నుంచి హెల్త్ స్పేష్ వరకు పలు రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. హిందీ చిత్రాలు అజాన్, ముంబై మిర్రర్, జాక్‌పాట్‌లలో నటించారు.