మావోల నియోజకవర్గంలో పోలీసుల జల్లెడ

ఎన్నికలకు విఘాతం కలగకుండా ఏర్పాట్లు
కాకినాడ,మార్చి29(జ‌నంసాక్షి):  సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌ బలగాలు రంపచోడవరం నియోజకవర్గంలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఎన్నికల నాటికి పూర్తిగా అన్ని ప్రాంతాలు పోలీసుల అదుపులోకి వచ్చేలా చర్యలు చేపట్టారు. పారా మిలటరీ బలగాలతోపాటు, యాంటీ నక్సల్స్‌ స్క్వాడ్‌ పార్టీల్ని రంగంలోకి దింపారు. ఎన్నికల నిర్వహణ అంశంపై చత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఆంధ్రా పోలీస్‌ ఉన్నతాధికారులు కూడా ఇటీవల తెలంగాణలో సమావేశమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో ఎన్నికల నిర్వహణంటే పెద్ద సవాల్‌ కావడంతో ముందస్తుగా భారీ ఏర్పాట్లకు సిద్దం కావాల్సి వస్తోంది. ముఖ్యంగా రంపచోడవరం నియోజకవర్గంలో ప్రశాంతంగా పోలింగ్‌ జరపడం పోలీసు యంత్రాగానికి సవాల్‌ కానుంది. మావోల ప్రభావం కారణంగా ఎలాంటి హింస చోటుచేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు నియోజకవర్గంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కార్యచరణ రూపొందించారు. రంపచోడవరం నుంచి పోలింగ్‌ బూత్‌లకు ఈవీఎంల తరలింపు, పోలింగ్‌ ముగిశాక స్టాం/-రగ్‌ రూమ్‌కు చేర్చే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రణాళిక తయారుచేశారు.  తెలంగాణ లోని భద్రాచలం డివిజన్‌ నుంచి నాలుగు మండలాలు కలిశాక భౌగోళికంగా అతిపెద్ద నియోజకవర్గంగా రంపచోడవరం నిలిచింది. నియోజకవర్గంలో కొన్ని మండలాలు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సరిహద్దులో ఉన్నాయి. మావోలు చొరబడే అవకాశం ఉండడంతో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. నియోజకవర్గంలోని చింతూరు మండలంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి నియోజకవర్గంలోని 11 మండలాల
పరిధిలో 397 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు.  మారుమూల ప్రాంతాల్లోని ఓటర్లు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా లేకుండా కొత్త పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు.