మిల్లర్ల వద్ద డబ్బులు తీసుకునే సంస్కృతి నాది కాదు

బాధ్యత రాహిత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకోను
నాలాంటి నిజాయితీపరుడిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదు
సివిల్‌ సప్లయ్‌ విభాగంలో బీఆర్‌ఎస్‌ హయాంలో 58 వేల కోట్ల అప్పులు
మీడియా ఎదుట ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
హైదరాబాద్‌ (జనంసాక్షి)
బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. అబద్ధాలు, అవాస్తవాలను ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో సివిల్‌ సప్లయ్‌ డిపార్ట్మెంట్‌ 58 వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందని అన్నారు. తాము తడిచిన ధాన్యాన్ని ఎమ్మెస్పీ ధరకి కొనాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ఎమ్మెస్పీ ధరకు కొన్న ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ మహేశ్వర రెడ్డి ఢల్లీికి డబ్బులు పంపి ఆ పదవిని కొనుక్కున్నారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. ఢల్లీికి డబ్బు పంపే సంస్కృతి తమది కాదని తెలిపారు. బయట ధాన్యం గురించి మాట్లాడి, లోపల భూముల విషయం మాట్లాడే సంస్కారం తమది కాదని అన్నారు. కేటీఆర్‌, మహేశ్వర రెడ్డి తెలిసీ తెలియని విషయాలను మాట్లాడుతున్నారని అన్నారు. అటువంటి బాధ్యతారాహిత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. తనలాంటి నిజాయితీ పరుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైంది కాదని చెప్పుకొచ్చారు. టెండర్‌లో ఉన్న కండిషన్స్‌కి ఒప్పుకుంటే ఎంత ధాన్యం అమ్మినా ప్రభుత్వం కొంటుందని తెలిపారు. మిల్లర్లపై ఇంత కఠినంగా ఉన్న ప్రభుత్వం తమదేనని అన్నారు. మిల్లర్లలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సన్న ధాన్యానికి గత ప్రభుత్వంలో 1700 వచ్చింది, ఇప్పుడు 2400 వస్తోందన్నారు. మిల్లర్లపై గత ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. బీజేపీ పార్టీలో ఓవర్‌ స్పీడ్‌గా పోవాలని మహేశ్వర రెడ్డి అనుకుంటున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. కిషన్‌ రెడ్డిని ఓవర్‌ టేక్‌ చేయాలని మహేశ్వర రెడ్డి భావిస్తున్నారని అన్నారు. సమావేశంలో మంత్రి శ్రీధర్‌ బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు లక్ష్మణ్‌ కుమార్‌, సంజీవరెడ్డి, మీడియా కమిటీ చైర్మన్‌ రామ్మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.