మీడియా తప్పులపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు

 న్యూఢిల్లీ :  మీడియా సంస్థలపై తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. స్వేచ్ఛా హక్కు ద్వారా మీడియా చేసే పొరపాట్లను పెద్దవి చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

‘‘వార్తను త్వరగతిన ఇవ్వాలన్న ఆత్రుత వల్లనో లేక మరేయితర కారణంతోనో చిన్న చిన్న తప్పులు చేస్తూ మీడియా సంస్థలు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. తమ పరువుకు భంగం వాటిల్లినప్పుడు బాధితులు కోర్టులను ఆశ్రయించవచ్చు. అది రాజ్యాంగ బద్ధంగా వారికి కల్పించబడిన హక్కు. అయితే మీడియా సంస్థలు చేసే పొరపాట్లు అవి అవతలివారికి నష్టం​ కలిగించేవే అయినా.. అవి పరువు నష్టం కిందకు రాబోవు’’ అని చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా వ్యాఖ్యానించారు.

ఓ హిందీ టీవీ ఛానెల్‌ తనపై అసత్య వార్తలు ప్రచురించాయని బిహార్‌కు చెందిన ఓ మహిళ ఏడేళ్ల క్రితం పట్నా హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. భూకబ్జా వ్యవహారంలో తన పేరు, తన కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ తప్పుడు కథనాలతో తన పరువుకు భంగం కలిగించారని ఆమె పిటిషన్‌లో పేర‍్కొన్నారు. అయితే వెంటనే ఆ మీడియా సంస్థ క్షమాపణలు తెలియజేస్తూ ప్రకటన ఇవ్వగా.. ఆమె ఆ మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేడాది సెప్టెంబర్‌ లో హైకోర్టు బెంచ్‌ ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించటంతో సోమవారం ఆ పిటిషన్‌ విచారణకు రాగా.. న్యాయమూర్తి పైన పేర్కొన్న వ్యాఖ్యలు చేశారు.