ముంబైలో మరోమారు అగ్నిప్రమాదం

అదుపులోకి తెచ్చిన అగ్నిమాపకదళం

ముంబై,నవంబర్‌1(జ‌నంసాక్షి): మహానగరం ముంబైలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాంద్రా ప్రాంతంలో గల నర్గీస్‌దత్‌ నగర్‌కు చెందిన మురికివాడలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్‌ బ్రిగేడ్‌కు చెందిన 9 వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేసాయి. ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణనష్టం జరిగిందనే సమాచారం లేదు. ఫైర్‌ బ్రిగేడ్‌ చెప్పిన వివరాల ప్రకారం ఇది లెవెల్‌ 4 అగ్ని ప్రమాదం. దీనికి గల కారణాలు తెలియరాలేదు. అయితే స్థానికులు ఏదో పేలుడు శబ్దం వినిపించిందని చెబుతున్నారు. కాగా ఈ అగ్నిప్రమాదం ఈరోజు ఉదయం 11. 36 నిముషాలకు చోటుచేసుకుంది. బ్రిగేడ్‌ స్టేషన్‌ ఇక్కడికి సవిూపంలోనే ఉండటం వలన వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 10 వాటర్‌ ట్యాంకర్లు, 12 ఫైర్‌ ఇంజిన్లు, 4 అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకుని సేవలు అందిస్తున్నాయి.