ముగిసిన నామినేషన్‌ల పర్వం

4

– జీహెచ్‌ఎంసీ బరిలో 1499 మంది

హైదరాబాద్‌,జనవరి21(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల బరిలో 1,499 మంది అభ్యర్థులు నిలిచారని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్థన్‌ రెడ్డి ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ముగియడంతో విూడియాకు ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. 1,214 మంది అభ్యర్థులు నామినేషన్‌ ఉపసంహరించుకున్నారని జనార్థన్‌ రెడ్డి చెప్పారు. నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో టీఆర్‌ఎస్‌ నుంచి 307 మంది ఉపసంహరించుకున్నారని తెలిపారు. టీడీపీ నుంచి 252, బీజేపీ నుంచి 182, కాంగ్రెస్‌ నుంచి 230, బీఎస్పీ నుంచి 14, ఎంఐఎం నుంచి 6, సీపీఎం నుంచి 2, సీపీఐ నుంచి 2 నామినేషన్ల ఉపసంహరణ జరిగిందన్నారు. 192 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు ఉపసంహరించుకున్నట్టు జనార్థన్‌ రెడ్డి వివరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ ఫిబ్రవరి 2న జరుగుతుందని, 5న కౌంటింగ్‌ జరుపుతామని జనార్ధనరెడ్డి చెప్పారు. ఫిబ్రవరి 6న మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. ఫిబ్రవరి 11న మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. మొత్తం 150వార్డులకు గాను 1,499మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు జిహెచ్‌ఎంసి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు అయిన నేడు గురువారం 1,214మంది తమ నామినేషన్లను అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. మొత్తం 150వార్డులకు గాను 1,499మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని జిహెచ్‌ఎంసి కమిషనర్‌ డా.బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నుండి 307, టిడిపి నుండి 252, బిజెపి నుండి 182, భారత జాతీయ కాంగ్రెస్‌ నుండి 230, బీఎస్‌పి నుండి 16, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌సిపిల నుండి ఇద్దరు చొప్పున, ఎంఐఎం నుండి ఆరుగురు, స్వతంత్రులు 192మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని వివరించారు. నామినేషన్ల ఉపసంహరణపై తుది నివేదిక అందాల్సి ఉందని కమిషనర్‌ స్పష్టం చేశారు. రేపు శుక్రవారం ఉదయం 10:30గంటలకు జిహెచ్‌ఎంసి కేంద్ర కార్యాలయంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్ల తొలి ర్యాండమైజేషన్‌ జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావలిలో భాగంగా ఇప్పటి వరకు 1,40,08,000 రూపాయలను స్వాధీనపర్చుకున్నామని తెలిపారు. దాదాపు 30వేల రూపాయల విలువైన అక్రమ మద్యాన్ని స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. లక్షా60వేల అక్రమ కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు తొలగించామని పేర్కొన్నారు.

ఫిబ్రవరి 11న మేయర్‌, డిప్యూటి మేయర్‌ల ఎన్నిక

గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌, డిప్యూటి మేయర్ల ఎన్నికకుగాను ఫిబ్రవరి 6వ తేదీన నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు ప్రత్యేకంగా నోటీసు జారీచేయడం జరుగుతుందని కమిషనర్‌ తలిపారు. మేయర్‌, డిప్యూటి మేయర్‌ల ఎన్నిక ఫిబ్రవరి 11న నిర్వహించడం జరుగుతుందని, ఈ ఎన్నికకు రంగారెడ్డి లేదా హైదరాబాద్‌ కలెక్టర్లలో ఒకరిని రిటర్నింగ్‌ అధికారిగా నియమించడం జరుగుతుందని కమిషనర్‌ పేర్కొన్నారు.

విూడియా సెంటర్‌ ఏర్పాటు

జిహెచ్‌ఎంసి ఎన్నికల సమాచారాన్ని ప్రజలకు అందించడానికి జిహెచ్‌ఎంసి కార్యాలయంలో ప్రత్యేకంగా విూడియా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విూడియా కేంద్రంలో ఎన్నికల సమాచారాన్ని చార్ట్‌ల రూపంలో ప్రదర్శించడంతో పాటు ఎన్నికల సమాచారం, ఫిర్యాదులను స్వీకరించడానికి మూడు టెలీఫోన్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 040-2361330, 23222018, 23221978 నెంబర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

మొత్తం 7,792పోలింగ్‌ కేంద్రాలు

జిహెచ్‌ఎంసి ఎన్నిలకుగాను 35 అదనపు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు.  కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య పెరగడంతో ఈ అదనపు పోలింగ్‌ కేంద్రాలను  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటితో కలిపి మొత్తం 7,792 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు జనార్థన్‌రెడ్డి తెలిపారు.

ఈనెల 27లోపు పోస్టల్‌ బ్యాలెట్ల పంపిణీ

ఎన్నికల విధుల్లోఉన్న ఉద్యోగులకు ఈ నెల 27వ తేదీలోగా పోస్టల్‌ బ్యాలెట్లను పంపిణీచేయనున్నట్లు డా.బి.జనార్థన్‌రెడ్డి పేర్కొన్నారు.  ఈ పోస్టల్‌ బ్యాలెట్లను ఫిబ్రవరి 4వ తేదీలోపు సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఓటింగ్‌లో తప్పనిసరిగా పాల్గొనాల్సిందిగా ఓటర్లను చైతన్య పరిచేందుకుగాను వారి పిల్లలచే సంకల్ప పత్రాలను పంపిణీచేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు గ్రేటర్‌ పరిధిలో 8.92లక్షల  ఓటరు స్లిప్‌లను ఓటర్లకు పంపిణీ చేశామని పేర్కొన్నారు. వీటితో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌,  ప్రత్యేక యాప్‌ ద్వారా 3.83లక్షల మంది ఓటరు స్లిప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని వివరించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌ సురేంద్రమోహన్‌, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.