ముజఫర్‌పుర్‌ ఘటనతో సిగ్గుపడుతున్నాం!

– ఘటనలో బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకుంటాం
– కేసును సీబీఐ విచారిస్తోంది
– బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌
పట్నా, ఆగస్టు3(జ‌నం సాక్షి) : బీహార్‌లో సంచలనం సృష్టిస్తున్న వసతి గృహంలోని అమ్మాయిలపై అత్యాచార ఘటనపై కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఎట్టకేలకు శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో పెదవివిప్పారు. అమ్మాయిలపై అత్యాచారాల ఘటన తమ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని, ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. ‘ముజఫర్‌పుర్‌లో జరిగిన ఘటనతో సిగ్గుపడుతున్నామని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూస్తామన్నారు. ఈ కేసును సీబీఐ విచారిస్తోందదని, దీన్ని హైకోర్టు కూడా పర్యవేక్షించాలన్నారు. ఈ కేసులో రాజీ పడే ప్రసక్తే లేదని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని నితీశ్‌ హావిూ ఇచ్చారు. గత నెల ముజఫర్‌పుర్‌లో వెలుగుచూసిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. ముజఫర్‌పుర్‌లో ప్రభుత్వ నిధులతో నడుస్తున్న వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న 40 మందికి పైగా యువతులపై అత్యాచారం జరిగిందని, ఒక అమ్మాయిని కొట్టి చంపేసి పాతిపెట్టేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పందించిన పోలీసులు వసతి గృహం ఆవరణలో తవ్వి చూశారు. అమ్మాయిలకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. 34 మందిపై లైంగికదాడి జరిగిందని నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఇప్పటివరకు పోలీసులు 10 మందిని అరెస్టు చేశారు. మరోవైపు ఘటన నేపథ్యంలో బిహార్‌ ప్రభుత్వంపై అక్కడి ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో బంద్‌ చేపట్టాయి.