ముషారఫ్‌కు చేదు అనుభవం

బూటు విసిరిన వకీల్‌
ఇస్లామాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి):
పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ముషారఫ్‌కు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. కరాచీలోని సింధ్‌ హైకోర్టుకు వచ్చినప్పుడు ఆయన పరాభవం చవిచూ శారు. కోర్టుకు హాజరై భయటకు వస్తుండగా ఆయనపై ఒక లాయర్‌ బూటు విసిరేశాడు. అయితే అది గురితప్పింది. ఎవరూ కేసు పెట్టకపోవడంతో ఆ లాయర్‌ను అరెస్టు చేయలేదు. 1999లో సైనిక కుట్ర ద్వారా అధికారంలోకి వచ్చిన ముషారఫ్‌ అంటే చాలామంది లాయర్లకు ఇష్టం లేదు. ముషారఫ్‌ అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జి సహా పలువురు న్యాయమూర్తులను సస్పెండ్‌ చేశారు. దీంతో న్యాయవర్గాల్లో ముషారఫ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ రోజు కోర్టు హాలులోంచి పటిష్ట భద్రతా, మద్దతు దారులు, జర్నలిస్టుల మధ్యనుంచి నడిచి వస్తుండగా ఒక లాయర్‌ ఆయనపైకి బూటు విసిరాడని నసీర్‌ఆఫ్తాబ్‌ అనే పోలీస్‌ అధికారి చెప్పారు. ముషారఫ్‌పై బూట్లు, చెప్పులు విసరడం వంటి సంఘటన ఇదే తొలిసారి కాదు. 2011లో ముషారఫ్‌ బ్రిటన్‌లో ఒక సభలో ప్రసంగిస్తుండగా ఒక వ్యక్తి ఆయనపైకి బూటు విసిరాడు. ఇదిలా ఉండగా ముషారఫ్‌కు మూడు కేసులలో ముందస్తు బెయిల్‌ను కోర్టు పొడిగించింది. 2007లో మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో, అక్బర్‌ బుగ్తి హత్యకేసులలో ఆయన నిందితుడు. ఈ రెండు కేసులలో ఆయనకు 21రోజులపాటు బెయిల్‌ను పొడిగించింది. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు పలువురు న్యాయమూర్తులను చట్ట విరుద్దంగా తొలగించిన మూడో కేసులో కూడా ఆయనకు బెయిల్‌ పొడిగించింది. నేటితో ఆయనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ ముగియడంతో ముషారఫ్‌ నేడు కోర్టుకు హాజరయ్యారు. బెయిల్‌పై ఉన్న సమయంలో దేశం విడిచి వెళ్ళరాదని ముషారఫ్‌ను ఆదేశించినట్టు ఒక టీవీ ఛానెల్‌ తెలిపింది. దాదాపు నాలుగేళ్ల అజ్ఞాతం తరువాత ముషారఫ్‌ ఈ నెల 24వ తేదీన పాకిస్థాన్‌కు తిరిగి వచ్చారు.