మూడు,నాలుగు టెస్టులకు జట్టు ఎంపిక రేపే

ముంబై ,నవంబర్‌ 26  :ఇంగ్లాండ్‌తో జరిగే మిగిలిన రెండు టెస్టులకు భారత జట్టును రేపు ఎంపిక చేయనున్నారు. దీని కోసం సెలక్షన్‌ కమిటీ మంగళవారం ముంబైలో సమావేశం కానున్నట్టు బీసిసిఐ సెక్రటరీ సంజయ్‌ జగ్ధాలే చెప్పారు. ఈ సెలక్షన్‌ కమిటీ విూటింగ్‌కు కెప్టెన్‌ ధోనీతో పాటు కోచ్‌ డంకన్‌ ఫ్లెచర్‌ కూడా హాజరు కానున్నారు. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం మిగిలిన రెండు మ్యాచ్‌లకు జట్టులో సంచలన మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు. ముంబై టెస్టు ముగిసిన తర్వాత ధోనీ మాటల్లో కూడా ఇదే స్పందన కనిపించింది. రొటేషన్‌ ప్రకారం మార్పులు జరిగే అవకాశమున్నట్టు ధోనీ సూచనప్రాయంగా తెలిపాడు. స్పిన్‌ విభాగంలో ఓజా , అశ్విన్‌లపై వేటు పడకున్నా… హర్భజన్‌ విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ముంబై టెస్టులో ఒక పేసర్‌ను తప్పించి భజ్జీని తుది జట్టులోకి తీసుకున్నప్పటకీ… ఏ మాత్రం ఫలితం దక్కలేదు. హర్భజన్‌ ఇంగ్లాండ్‌పై ప్రభావం చూపలేకపోయాడు. ఈ నేపథ్యంలో అమిత్‌మిశ్రా , పియూష్‌ చావ్లాల పేర్లు చర్చకు వచ్చే అవకాశముంది. బ్యాటింగ్‌ విభాగంలో ఎటువంటి మార్పులు జరిగే ఛాన్స్‌ లేదు. ముంబై టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ విఫలమైనప్పటకీ… మిగిలిన రెండు మ్యాచ్‌లలో పుంజుకుంటారని ధోనీ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. కాగా రెండో టెస్ట్‌ డిసెంబర్‌ ఐదు నుండి కోల్‌కత్తాలో జరగనుండగా… డిసెంబర్‌ 13 నుండి చివరి టెస్ట్‌ నాగ్‌పూర్‌లో జరుగుతోంది.