మృగాడికి బుద్ధిచెప్పిన యువతి..!

తిరువనంతపురం: తనను అత్యాచారం చేసేందుకు యత్నించిన వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కొన్న యువతి అతడి మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన కేరళలోని కోళ్లామ్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆ వివారాలిలా ఉన్నాయి.. కోళ్లామ్‌లోని పద్మనలో 23 ఏళ్ల యువతి తన తల్లిదండ్రులతో కలిసి గణేషానంద తీర్థపద స్వామి(54) అలియాస్ హరి ఆశ్రమంలో ఉంటోంది. యువతి తల్లిదండ్రులు ఆ దొంగబాబును విశ్వసించి ఆయన ఆశ్రయంలో ఉంటూ సేవలు చేస్తుండేవారు. ఈ క్రమంలో ఆ యువతిపై దొంగబాబా కన్నేశాడు. గత కొంతకాలం నుంచి గణేషానంద స్వామిగా సేవలు పొందుతున్న అతడు యువతిపై వేధింపులకు పాల్పడుతున్నాడు.

రెండు రోజులుగా అతడి ఆగడాలు మితిమీరిపోయాయి. శుక్రవారం రాత్రి ఏకంగా యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వద్దని ఎంత చెప్పినా బాబా వినకుండా తనపై దారుణానికి యత్నించడంతో అతడి పురుషాంగాన్ని కోసేసినట్లు తెలిపింది. తిరువనంతపురం పోలీసులకు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పి, ఫిర్యాదు చేసింది. పోస్కో చట్టం కింద అతడిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ గణేషానంద స్వామి తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. యువతిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు.

గతేడాది ఏప్రిల్‌లో ఈశాన్య అసోంలోని భారాజులి గ్రామంలో యువకుడు తనను రేప్ చేయబోతే మహిళ ధైర్యంగా ఎదుర్కొని కృష్ణ భూంజీ అనే యువకుడి పురుషాంగం కోసేసింది. ఆ యువకుడు తీవ్ర రక్తస్రావమై ఆ మరుసటిరోజు చనిపోయిన విషయం తెలిసిందే.