మే 4న ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక

ముంబై ,ఏప్రిల్‌ 29  (జనంసాక్షి) :
వచ్చే నెలలో ఇంగ్లాండ్‌ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత తుది జట్టును శనివారం ఎంపిక చేయనున్నారు. దీని కోసం బీసిసిఐ చీఫ్‌ సెలక్టర్‌ సందీప్‌పాటిల్‌ సారథ్యంలోని ఐదుగురి సభ్యులతో కూడిన సెలక్షన్‌ కమిటీ ముంబైలో సమావేశం కానుంది. ఇప్పటికే 30 మందితో కూడిన ప్రాబబుల్స్‌ జాబితాను ప్రకటించడం జరిగింది. దీనిలో సీనియర్‌ ప్లేయర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌సింగ్‌, జహీర్‌ఖాన్‌లకు చోటు దక్కలేదు. దీంతో వీరి కెరీర్‌ ముగిసినట్టేనని భావిస్తున్నారు. అయితే ప్రాబబుల్స్‌లో వారినే తుది జట్టులోకి ఎంపిక చేయాలన్న  ఖచ్చితమైన నిబంధన లేదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ప్రాబబుల్స్‌లో లేకున్నా బయటి ప్లేయర్లను కూడా ఎంపిక చేయోచ్చని ఐసిసి చెప్పడంతో ఇప్పుడు జట్టు సెలక్షన్‌ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్‌ ఆరో సీజన్‌లో సెహ్వాగ్‌, హర్భజన్‌ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ నేపథ్యంలో వీరికి ఛాంపియన్స్‌ ట్రోఫీకి చోటు దక్కడంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో సత్తా చాటుతోన్న పలువురు యువ ఆటగాళ్ళు సెలక్టర్ల పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఛాంపియ న్స్‌ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో భారత జట్టు సౌతాఫ్రికాతో తలపడనుంది.
భారత ప్రాబబుల్స్‌ జాబితా :
మురళీ విజయ్‌, శిఖర్‌ ధావన్‌, గంభీర్‌, ఉన్ముక్త్‌ చాంద్‌, విరాట్‌ కోహ్లీ, యువరా జ్‌సింగ్‌, సురేష్‌రైనా, రోహిత్‌శర్మ, మనోజ్‌ తివారీ, రహానే, దినేశ్‌ కార్తీక్‌, అశ్విన్‌, అమిత్‌మిశ్రా, రవీంద్రజడేజా, జలజ్‌ సక్సేనా, పర్వేజ్‌ రసూల్‌, ఇశాంత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, అశోక్‌ దిండా, ఉమేశ్‌ యాదవ్‌, షమి అహ్మద్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, ప్రవీణ్‌ కుమార్‌, ఈశ్వర్‌ పాండే, సిధ్దార్థ్‌ కౌల్‌