మోదీపాలనతో దేశానికి ప్రమాదం
– సోనియా, రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ,జూన్9(జనంసాక్షి):
ఎన్డీఏ సర్కారు పాలనా తీరు, దేశానికి ప్రమాదమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. మంగళవారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో సోనియా సమావేశమయ్యారు. పార్టీకి సంబంధించిన, ప్రభుత్వాలకు సంబంధించిన విసయాలను చర్చించారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలపై గళమెత్తానలి సూచించారు. సమావేశం అనంతరం రాహుల్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మోదీ సర్కారు రాష్ట్రాలకు ఓ చేత్తో డబ్బులిస్తూ మరో చేత్తో లాక్కుంటోందని విమర్శించారు. గ్రావిూణాభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎంలకు పూర్తి స్వేచ్చనిచ్చామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎంలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వారికి అధిష్ఠానం నైతిక మద్దతును మాత్రమే ఇస్తుందని వెల్లడించారు. ఇదిలావుంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని ఓ విషయంలో ప్రశంసించారు. కమ్యూనికేషన్ విషయంలో తన కంటే ముందున్నాడని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పారు. సమర్థవంతమైన వర్తకుడని, మంచి కార్య నిర్వాహకుడు అంటూ కలుపుగోలుతనంలో మోడీ తన కంటే ఎంతో ముందున్నాడని మన్మోహన్ అన్నారు. అయితే తమ యూపీఏ హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలనే మోడీ కొత్త పేర్లతో అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో కేరళ సిఎం వుమెన్ చాందీ,గులాంనబీ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.