మోదీ-షరీఫ్ భేటీ ఏడుగుర్ని బలి తీసుకుంది : శివసేన
ముంబై : ప్రధాని మోదీపై బీజేపీ మిత్రపక్షం శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పఠాన్కోట్ వైమానికి స్థావరంపై జరిగిన దాడి పట్ల విచారం వ్యక్తం చేసిన ఆ పార్టీ.. దేశ భద్రతపై ప్రధాని ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించింది. మోదీ-షరీఫ్ బర్త్డే భేటీ ఏడుగురి ప్రాణాలను బలి తీసుకుందని శివసేన పత్రిక తన కథనంలో ఆరోపించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో తేనీటి విందులో పాల్గొనడం అది మోదీ వ్యక్తిగత విషయమే. కానీ ఆ ఛాయ్ పార్టీ కోసం ఏడుగురు సైనికుల్ని కోల్పోవాల్సి వచ్చింది. సైనికులు ఎందుకు వీరమరణం పొందారు ? ఈ దేశం ఎందుకు ఎదురు పోరాడలేకపోతుంది ? దీనికి సమాధానం కావాలి అంటూ శివసేన ఎడిటోరియల్ ప్రశ్నించింది. పాకిస్థాన్పై భారత్ పెట్టుకున్న నమ్మకాన్ని ఆ దేశం వొమ్ము చేసిందని, పఠాన్కోట్కు ఉగ్రవాదులను పంపిన పాక్ మన విశ్వాసాన్ని దెబ్బతీసిందని శివసేన ఆరోపించింది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడాలంటే ఉగ్రవాది మౌలానా మసూద్ అజర్ను భారత్కు అప్పగించాలని శివసేన డిమాండ్ చేసింది.