రక్షణ స్వావలంబనే లక్ష్యం
కేంద్రంలో యుపిఏ హయాంలో రక్షణ రంగ స్వావలంబనకంటే కూడా రక్షణ లావాదేవీల్లో అవినీతి తీవ్రంగా ఉండేదని హోమ్మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అవినీతి, కుంభకోణాల కారణంగానే రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంబన సాధించలేకపోయామని తెలిపారు. తమ ప్రభుత్వం దేశీయంగా రక్షణ ఉత్పత్తులను పెంపొందించేందుకు గట్టి చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ కంపెనీలు ఆసక్తిని కనబరచడమేకాకుండా టెక్నాలజీని బదలాయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్న రాజ్నాథ్ ఇలాంటి కంపెనీలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. గతంలో రక్షణ ఉత్పత్తులను పెంపొందించే అవకాశం ఉన్నా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదని ఆయన అన్నారు. దీని కారణంగా పోటీ తత్వానికి బదులు రక్షణ ఆర్డర్లలో అవినీతి పెచ్చరిల్లిందని విమర్శించారు. అయితే తమ ప్రభుత్వం వచ్చిన తరువాత పోటీ తత్వం, పారదర్శకతను పెంపొందించామని ఆ విధంగా దేశీయంగానే రక్షణ ఉత్పత్తులను చేపట్టే చర్యలకు ప్రాధాన్యతను ఇచ్చామని రాజ్నాథ్ వెల్లడించారు. బుధవారం ఇక్కడ అసోచామ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్నాథ్ అంతర్గత భద్రత శక్తివంతం కావాలంటే రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంబన ఎంతో అవసరమని ఉద్ఘాటించారు.