రఫెల్‌ వివరాలు కోర్టుకివ్వలేం!


– 10రోజుల్లో రాఫెల్‌ వివరాలివ్వాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం
– వివరాలు బహిర్గతం చేయలేమని కేంద్రం వెల్లడి
– వీలుకాదని అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం సూచన
– తదుపరి విచారణ నవంబర్‌ 14కు వాయిదా
న్యూఢిల్లీ, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) : రఫెల్‌ వివరాలు రహస్యమని, వాటిని బహిర్గతం చేయలేని సుప్రింకోర్టు కు కేంద్రం స్పష్టం చేసింది. రఫెల్‌ ఒప్పందంపై రాజకీయ దుమారం రేగినవేళ ఈ వ్యవహారానికి సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. రాఫేల్‌ ఒప్పందానికి అయిన ఖర్చు, యుద్ధ విమానాల ధర తదితర పూర్తి వివరాలను సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని న్యాయస్థానం అడిగింది. ఒప్పందం విలువ, యుద్ధ విమానాల ధరకు సంబంధించిన వివరాలను సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించాలని సూచించింది. రానున్న 10రోజుల్లో ఇది జరగాలని జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం కేంద్రానికి సూచించింది. అయితే కేవలం ధరకు సంబంధించిన వివరాలు మాత్రమే తాము అడుగుతున్నామని, సాంకేతికపరమైన వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ యుద్ధవిమానాల ధర చాలా ప్రత్యేకమైనదని, దీన్ని న్యాయస్థానంతో పంచుకోలేమని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో ఆ వివరాలను న్యాయస్థానానికి ఇవ్వలేమని తెలిపారు. దీంతో ఒప్పందం వివరాలను పంచుకోలేమని చెప్పే అఫిడవిట్‌ను న్యాయస్థానానికి సమర్పించాలని కోర్టు సూచించింది. దీనిపై తదుపరి విచారణను నవంబరు 14కు వాయిదా వేసింది.
రఫేల్‌ ఒప్పందంలో భారీ కుంభకోణం దాగిఉందని గత కొన్నిరోజులుగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రఫేల్‌ ఒప్పందం కోసం అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ను భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ¬లన్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. రఫేల్‌ ఒప్పందం వివాదం తీవ్ర రూపం దాల్చడంతో దీనిపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది.