రఫేల్ ఒప్పందంలో కుంభకోణం ముమ్మాటికి నిజం
డసో పెట్టుబడులతో భూములు కొన్న అంబానీ
హెచ్ఎఎల్ను పక్కన పెట్టడంలోనే మతలబు దాగివుంది
ప్రధాని మోడీ నిద్రపట్టని రాత్రులు గడుపుతున్నారు
విచారణ జరిగితే అడ్డంగా దొరికిపోతారు
మరోమారు విమర్శలు ఎక్కు పెట్టిన రాహుల్
న్యూఢిల్లీ,నవంబర్2(జనంసాక్షి): రఫేల్ ఒప్పందంలో కుంభకోణం దాగి ఉందని, దీనిపై దర్యాప్తు జరిగితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ తప్పించుకోలేరని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాందీ మరోమారు విమర్వలు ఎక్కుపెట్టారు. దీంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన పునరుద్ఘాటించారు. విచారణ జరిగితే మోడీ నిద్రలేని రాత్రులు గడపడం ఖాయమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ అన్నారు. శుక్రవారం ఆయనిక్కడ విూడియాతో మాట్లాడుతూ రాఫెల్ ఒప్పందంపై తాజాగా ఓ విూడియా సంస్థ పరిశోధనలు చేసి నివేదిక రూపొందించింది. ఈ నివేదికను ఆధారంగా తీసుకుని రాహుల్ మరోసారి కేంద్రం, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీని కాపాడేందుకు డసో ఏవియేషన్ సీఈవో అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. డొల్ల కంపెనీగా నష్టాల్లో ఉన్న అంబానీ కంపెనీకి ఎలా కట్టబెడతారని అన్నారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్కు భూమి ఉంది, హాల్కు లేదని కాంట్రాక్టు ఇవ్వలేదని డసో సీఈవో చెప్పారు. అయితే రిలయన్స్ డిఫెన్స్ వద్ద ఉన్న భూమిని డసో ఇచ్చిన డబ్బులతోనే కొనుగోలు చేశారు. అనిల్ అంబానీ కంపెనీలో డసో ఏవియేషన్ రూ.284కోట్ల పెట్టుబడులు పెట్టింది. తర్వాత ఆ డబ్బుతోనే ఆ సంస్థ భూమిని కొనుగోలు చేసింది. నష్టాల్లో ఉన్న ఓ కంపెనీలో డసో పెట్టుబడులు ఎందుకు పెట్టింది?. దీన్ని బట్టి చూస్తుంటే డసో సీఈవో అబద్ధం చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రఫేల్పై దర్యాప్తు ప్రారంభమైతే ప్రధాని మోదీ తప్పించుకోలేరు. అందుకు నాదీ గ్యారెంటీ. డసో ఒప్పందంపై రక్షణశాఖకు సమాచారం ఇవ్వకుండానే
మోదీ ఒక్కరే నిర్ణయం తీసుకున్నారు. అనిల్ అంబానీ కోసమే ఆయన ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు’ అని రాహుల్ దుయ్యబట్టారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో భారీ స్కామ్ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. రాఫెల్ విమానాల కొనుగోలుపై ప్రధాని మోదీనే నిర్ణయం తీసుకున్నారని, రాఫెల్ డీల్తో తనకు సంబంధంలేదని అప్పటి రక్షణ మంత్రి పారికర్ పేర్కొన్నారని, రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తు చేపడితే, ఆ విచారణలో మోదీ దొరికిపోతారని రాహుల్ అన్నారు. రాఫెల్ స్కామ్లో విచారణ ఎదుర్కొనేందుకు మోదీ భయపడుతున్నారని, అందుకే ఆయన సీబీఐ డైరక్టర్ను తొలగించారని ఆరోపించారు. ప్రధాని మోదీకి రాత్రి పూట నిద్ర రావడం లేదని, దర్యాప్తులో దొరికిపోతానేమో అన్న టెన్షన్లో ఉన్నారని రాహుల్ విమర్శించారు. రాఫెల్ కొనుగోలుపై దర్యాప్తు జరిగితే మోదీ దాన్ని ఎదుర్కోలేరని గ్యారెంటీ ఇస్తున్నట్లు రాహుల్ అన్నారు. డసాల్ట్ కంపెనీ ఎన్నో ముడుపులు చెల్లించిందని, అందులో ఇదొకటని రాహుల్ తెలిపారు. రాఫెల్ డీల్పై సీబీఐ నజర్ పడిందని, అందుకే ఆ డైరక్టర్ను తొలగించారన్నారు. అనిల్ అంబానీకి అనుకూలంగా మాట్లాడేందుకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్లోని డసాల్ట్ కంపెనీకి వెళ్లిందన్నారు. సుప్రీంకోర్టు కూడా రాఫెల్ ధర గురించి వెల్లడించాలని కోరినా, కేంద్రం మాత్రం వాటి ఖరీదు చెప్పలేను అని పేర్కొనడం శోచనీయమని రాహుల్ అన్నారు. అంటే ఆ ఒప్పందంలో స్కామ్ జరిగిందని రాహుల్ అన్నారు. రాఫెల్ ఒప్పందంలో అవినీతి చోటుచేసుకుందని, అందులో మొదటి దఫాగా 284 కోట్లు ముట్టాయని అన్నారు. ఆ డబ్బుతోనే రిలయన్స్ సంస్థ డిఫెన్స్ ప్రాజెక్టు కోసం భూమి కొందన్నారు. రిలయన్స్ కోసం డసాల్ట్ 284 కోట్లు ఇచ్చిందని, ఫ్రాన్స్ కంపెనీ ఆ డబ్బు ఎందుకు ఇచ్చిందో చెప్పాలని రాహుల్ ప్రశ్నించారు.