రఫేల్‌ పై కేంద్రానికి ఊటర!

– రివ్యూ పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
– గతంలో ఇచ్చిన తీర్పును పునఃసవిూక్షించాల్సిన అవసరం లేదన్న కోర్టు
– రాహుల్‌పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటీషన్‌ కొట్టివేత
– మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి
– రాహుల్‌ గాంధీని సున్నితంగా హెచ్చరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, నవంబర్‌14 (జనంసాక్షి)  : రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో కేంద్రానికి ఊరట లభించింది. రఫేల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది. సవిూక్ష పిటిషన్లన్నింటిని కోర్టు తిరస్కరించింది. సుమారు రూ.59,000 కోట్ల విలువైన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలు, ఇటీవల సుప్రీంతీర్పుని సవాల్‌ చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌ శౌరి, యశ్వంత్‌సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ విచారించిన సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. అలాగే కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. తద్వారా వివాదాస్పదమైన రాఫెల్‌ కేసులో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇచ్చిన్టటైంది. ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్‌ ఏవియేషన్‌ సంస్థ నుంచి 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ 2018 డిసెంబర్‌ 14న తీర్పు వెలువరించింది. అయితే, తీర్పుని మే 10న ధర్మాసనం రిజర్వ్‌లో పెట్టింది. దీనిపై దాఖలైన సవిూక్ష పిటీషన్‌ను కొట్టి వేస్తూ తాజాగా రాఫెల్‌ డీల్‌ పక్రియలో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు లేవని నిర్దారించింది.
రాహుల్‌ కాస్త జాగ్రత్తగా మాట్లాడండి – సుప్రీం
కోర్టు ధిక్కరణ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. రఫేల్‌ వ్యవహారంపై స్పందిస్తూ..ప్రధాని మోదీని ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ రాహుల్‌ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాజపా నేత విూనాక్షి రాహుల్‌పై కోర్టు ధిక్కరణ కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం రాహుల్‌ గాంధీని సున్నితంగా హెచ్చరించింది. ‘మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించింది. ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం వ్యాఖ్యలకు రాహుల్‌ క్షమాపణలు చెప్పారు. ఆయన క్షమాపణలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం వాదనలను ముగించింది.