దిల్లీ: విపక్ష సభ్యుల ఆందోళనతో మంగళవారం రాజ్యసభ దద్ధరిల్లింది. జేఎన్యూ అంశంపై వామపక్షాలు, ఉత్తరాఖండ్ అంశంపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. కన్నయ్యకుమార్కు జరిమానా విధించటంపై వామపక్షాలతో పాటు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తదితరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ అంశపై కాంగ్రెస్ సభ్యులు ఛైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభను 20 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు.అంతకు ముందు ఉత్తరాఖండ్ అంశంపై రాజ్యసభలో అరుణ్జైట్లీ ప్రకటన చేశారు. 67 మంది సభ్యుల్లో 35 మంది రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిరించారని ప్రకటించారు. ఆర్థిక బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు 35 మంది ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చారని జైట్లీ వెల్లడించారు.
రాజ్యసభ ప్రారంభమైన వెంటనే ఇటీవల ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రమాణం చేయించారు. నూతనంగా ఎన్నికైన మేరీకోమ్, సుబ్రమణ్యస్వామి ప్రమాణ స్వీకారం చేశారు.