రాజ్యసభలో స్మృతి వ్యాఖ్యలు కలకలం

3
– క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 26(జనంసాక్షి):రాజ్యసభలో జేఎన్‌యూ వివాదం ఇంకా చల్లారలేదు. జేఎన్‌యూపై చర్చ సందర్భంగా  కేంద్ర మానవవనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. స్మృతి ఇరానీ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని, అప్పటి వరకూ సభ జరగనీయమని బీఎస్పీ నేత మాయావతి పట్టుబట్టారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ సహా విపక్షాలన్నీ మాయావతికి మద్దతు పలికాయి. స్మృతి ఇరానీ దుర్గాదేవిని అవమానించారని విపక్షాలు ఆరోపించాయి. ఆమె వ్యాఖ్యలు దుర్గాదేవిని అవమానించేవిగా ఉన్నాయని కాంగ్రెస్‌ సభ్యుడు ఆనంద్‌ శర్మ మండిపడ్డారు. మంత్రి క్షమాపసణలుచెప్పిన తరవాతనే కార్యక్రమాలు కొనసగించాలన్నారు. స్మృతి ఇరానీ వ్యాఖ్యలను ప్రొసీడింగ్స్‌ నుంచి తొలగించాలని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత గులాంనబీ అజాద్‌ విజ్ఞప్తి చేయగా… నిబంధనలు పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ స్పష్టం చేశారు. విపక్షాల ఆరోపణలను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తిప్పికొట్టారు. ఎవరి మనోభావాలను కించపరిచేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ‘నేను హిందువును… దుర్గాదేవి భక్తురాలిని’అని స్పష్టం చేశారు. తాను దుర్గాదేవిపట్ల ఎలాంటి అపరాథం చేయలేదన్నారు. దీంతో శుక్రవారం  కూడా రాజ్యసభలో జేఎన్‌యూ వివాదం కొనసాగుతోంది.  మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టడంతో రాజ్యసభలో  తీవ్ర గందరగోళం నెలకొంది. యూనివర్సీటీల అంశంపై సభలో చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్‌ తరఫున ఆనంద్‌ శర్మ, గులాం నబీ ఆజాద్‌ తదితర సీనియర్‌ నేతలు.. స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాలని గట్టిగా డిమాండ్‌ చేశారు. అయితే.. తాను దుర్గామాత భక్తురాలినని తాను చదివిన డాక్యుమెంట్లనీ సరైనవేనని స్మృతి స్పష్టం చేశారు. వాస్తవం ఏంటో వివరించాలన్నారు కాబట్టే తాను ఆ డాక్యుమెంట్లు చదివానన్నారు. అవి చదివేటప్పుడు చాలా బాధపడ్డానని కూడా ఆమె చెప్పారు. జేఎన్‌యూలో దుర్గామాతను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, కరపత్రాలు పంచారని అంటూ.. వాటిని చూపించారు. అక్కడ మహిషాసురుడి ప్రాణత్యాగ దినం చేశారని కూడా ఆమె అన్నారు. దాంతో ప్రతిపక్ష నాయకులు ఒక్కసారిగా లేచి ఆమె వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభకు సంబంధం లేని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నారన్నారు. ఈ సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. తర్వాత స్మృతి సభలో నుంచి వెళ్లిపోయారు. ఆమె స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పేవరకు సభను నడవనిచ్చేది లేదని ఆనంద్‌ శర్మ, గులాంనబీ ఆజాద్‌ తదితరులు మండిపడ్డారు. అప్పుడు మరో మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ జోక్యం చేసుకున్నారు. సభలో క్షమాపణలు చెప్పాలి తప్ప చట్టాలు చేయొద్దంటారా అని ఆయన ప్రశ్నించారు. ఈ గందరగోళం నడుమ డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్‌ కలగజేసుకుని.. రికార్డులన్నింటినీ తాను పరిశీలిస్తానని, మతవిద్వేష పూరిత వ్యాఖ్యలు ఎవరు చేసినా.. వాటిని రికార్డుల నుంచి తొలగిస్తానని, తాను చేయగలిగింది ఇది మాత్రమేనని అన్నారు. పార్లమెంట్‌లో దేవతలపై వ్యాఖ్యలు చేయడాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌ తప్పుపట్టారు. సభ్యులెవరూ ఇక నుంచి సభలో దైవ దూషణపై వ్యాఖ్యానించరాదన్నారు. ఒక వర్గానికి చెందిన మనోభావాలను కించపరిచేవిధంగా ఎవరూ మాట్లాడరాదని కురియన్‌ అన్నారు. దైవ దూషణకు సంబంధించిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలిగిస్తున్నట్లు రాజ్యసభలో కురియన్‌ స్పష్టం చేశారు. సభ్యులను శాంతింప చేసే ప్రయత్నంలో కురియన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం చర్చను ముగించి, ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు.