రాజ్‌భవన్‌కు తెలంగాణ సెగ

కట్టుదిట్టమైన భద్రతను చేదించుకొని నినదించిన ‘ జై తెలంగాణ’
హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) :
రాజ్‌భవన్‌కు తెలంగాణ సెగ తగిలింది. రాష్ట్ర గవర్నర్‌ తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలిస్తున్నాడని పేర్కొంటూ శనివారం తెలంగాణవాదులు రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జెండా ఆవిష్కరణకు గవర్నర్‌ నరసింహన్‌ వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌ వద్దకు చేరుకున్న తెలంగాణవాదులు, విద్యార్థులు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అక్కడే మోహరించిన ఉన్న పోలీసులు తెలంగాణవాదులను అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ, గవర్నర్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణను అడ్డుకునేందుకు తప్పుడు నివేదికలిస్తూ కేంద్రాన్ని గందరగోళ పరుస్తున్నారని తెలిపారు. వారి తీరుమార్చుకుంటే మంచిదని లేనిపక్షంలో తగిన రీతిలో బుద్ధి చెప్పి తీరుతామని హెచ్చరించారు.