రాష్ర్టపతి ప్రణబ్‌ ను కలిసిన రాహుల్‌

1ఢిల్లీ : రాష్ర్టపతి ప్రణబ్‌ ముఖర్జీని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కలిశారు. ఢిల్లీలో శాంతిభద్రతలు, జేఎన్‌యు ఘటన, పటియాలా కోర్టులో పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. మరోవైపు మధ్యాహ్నం రాష్ర్టపతిని కేజ్రీవాల్‌ బృందం, సాయంత్రం జర్నలిస్టు సంఘాలు కలిసి ఫిర్యాదు చేయనున్నాయి. అటు జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌పై మోపిన దేశద్రోహం అభియోగాలను పోలీసులు ఎత్తివేసే అవకాశం కనిపిస్తోంది. ఆయనపై మోపిన దేశద్రోహం అభియోగాలకు మద్దతుగా ఇప్పటివరకు ఎలాంటి బలమైన ఆధారాలు లభించలేదని కేంద్ర హోంశాఖ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి కార్యాలయానికి జేఎన్‌యూ వ్యవహారంపై నివేదించారు. కన్హయ్య కుమార్‌కు ఇప్పటివరకు క్లీన్‌చిట్ ఇవ్వలేదని, ఆయనకు వ్యతిరేకంగా తమ వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని బస్సీ మీడియాకు చెప్తున్నారు.జవహర్‌ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా జరిగిన కార్యక్రమంలో జాతివ్యతిరేక నినాదాలు చేయడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే తాను ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని, అఫ్జల్ గురుకు ఎప్పుడూ మద్దతు తెలుపలేదని కన్హయ్యకుమార్ స్పష్టంచేశారు. భారత రాజ్యాంగంపై తనకు అపారమైన నమ్మకముందని, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చారు. దేశద్రోహం కేసులో ఢిల్లీ కోర్టు ఆయనకు మార్చి 2వతేదీవరకు జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది.