చాయ్‌వాలాకు ఐటీ అధికారుల సమన్లు

రూ.కోటిన్నర కట్నమిచ్చిఆరుగురు కుమార్తెలకు ఒకే రోజు పెళ్లి
జయపుర: ఓ చాయ్‌వాలా ఏకంగా రూ.1.51 కోట్లు కట్నమిచ్చి తన ఆరుగురు కుమార్తెలకు ఒకే రోజు పెళ్లి చేశాడు. విషయం తెలిసిన ఐటీ అధికారులు అతనికి సమన్లు జారీ చేశారు. వివరాల్లోకెళితే.. రాజస్థాన్‌కి చెందిన రామ్‌ గుజ్జర్‌ కోత్‌పుట్లి ప్రాంతంలో ఓ టీ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఆరుగురు కుమార్తెలు. ఏప్రిల్‌ 4న రామ్‌ తన ఆరుగురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాడు. వారికి కట్నంగా రూ.1.51 కోట్ల నగదును బయటికి తీసి వూరంతా చూస్తుండగా గట్టిగా అరుస్తూ వాటిని లెక్కపెట్టడం వైరల్‌గా మారింది.విషయం తెలిసి ఐటీ అధికారులు డబ్బు వివరాలు లెక్క చెప్పాల్సిందిగా రామ్‌కి సమన్లు జారీ చేశారు. కానీ రామ్‌ స్పందించలేదు. దాంతో అతనికి ఐటీ శాఖ మంగళవారం నోటీసులు పంపింది. గురువారం లోగా అతను ఆస్తి వివరాలు చెప్పకపోతే న్యాయపర్యమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. డబ్బు విషయంలోనే కాకుండా రామ్‌ తన ఆరుగురు కూతుళ్ల విషయంలోనూ బుక్కయ్యాడు. వారిలో ఇద్దరికి మాత్రమే పెళ్లిచేయాల్సి ఉండగా మైనర్లు అయిన మిగతా నలుగురు కుమార్తెలకు కూడా అదే రోజు వివాహం చేసేశాడు. దాంతో రామ్‌తో పాటు అతని మొత్తం కుటుంబీకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.