రెండు కుటుంబాల మధ్య ఘర్షణ, యువకుడికి తీవ్ర గాయాలు

పూణె, మే 5 : మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. పాత గొడవలు కారణంగా ఒక యువకుడిని మరో వ్యక్తి పెద్ద బండరాయితో తలపై మోదాడు. ఆ యువకుని పరిస్థితి విషమంగా ఉంది. పూణెలోని రెండు కుటుంబాల మధ్య పాతగొడవలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకునే క్రమంలో పెద్ద ఘర్షణ జరిగింది. ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి రెండో కుటుంబం ఇంట్లోకి చొరబడ్డాడు. వారితో గొడవ పెట్టుకున్నాడు.
అయితే ఆ కుటుంబ సభ్యులందరూ ఆ వ్యక్తిని ఎదుర్కొన్నారు. మూకుమ్మడిగా అతనికి దేహశుద్ధి చేశారు. ఆ వ్యక్తిని బయటకు నెట్టేశారు. ఆ కుటుంబ సభ్యులు తమ ఇంట్లోకి వెళ్లిపోయారు. అయితే కసి తీరని ఆ వ్యక్తి మళ్లీ వెనక్కి వచ్చాడు. ఆ సమయంలో ప్రత్యర్థి కుటుంబానికి చెందిన వ్యక్తి పార్కింగ్‌ ప్రదేశం వద్ద ఉన్నాడు. ఆగ్రహంతో ఊగిపోతున్న ఆ వ్యక్తి యువకుడిని రాయితో కొట్టాడు. యువకుడు పడిపోగానే స్పృహ తప్పేవరకు రాయితో కొట్టాడు. అప్పటికీ కక్ష తీరని ఆ వ్యక్తి పెద్ద బండరాయి తెచ్చి యువకుని తలపై మోదాడు.