రేవంత్‌కు నో బెయిల్‌

3

– విచారణ వాయిదా

హైదరాబాద్‌,జూన్‌24 (జనంసాక్షి):

ఓటుకు నోటు కేసులో అరెస్టు అయిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ శుక్రవారానికి వాయిదా పడింది.తెలంగాణ ఎసిబి అదికారులు తమకు ఈ కేసులో అదనపు సమాచారం లభించిందని,దానిని కూడా కోర్టుకు సమర్పించవలసి ఉందని, అఫిడవిట్‌ దాఖలు చేయడానికి మరో రెండు రోజులు గడవు కావాలని కోరడంతో హైకోర్టు ఈ మేరకు శుక్రవారానికి కేసును వాయిదా వేసింది. ఎసిబి వద్ద ఏమి అదనపు సమచారం ఉందన్నది ఆసక్తికరమైన విషయంగా మారింది. అయితే శుక్రవారం మధ్యాహ్నానికి మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేసింది. స్వరపరీక్షల నివేదిక వస్తుందన్న భావనతో ఈ వాయిదా కోరారా?లేక ఇంకేమైనా సంచలన విషయాలు ఎసిబి వద్ద ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాలతో అదనపు సమాచారంతో ఎసిబి కౌంటర్‌ దాఖలు చేయాల్సి ఉంది. అడిషనల్‌ కౌంటర్‌ దాఖలు చేయడానికి సోమవారం వరకు వాయిదా కావాలని అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి కోరారు. హైకోర్టు కౌంటర్‌ దాఖలు చేయడానికి శుక్రవారం మధ్యాహ్నం వరకు అనుమతి ఇచ్చింది.దీంతో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. బుధవారం ఉదయం రేవంత్‌ బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరిగింది. రేవంత్‌ కేసులో మరికొంత సమాచారం అందిందని, మళ్లీ కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని టీఎస్‌ ఏజీ కోర్టును కోరారు. వాదనలు వినిపించేందుకు వారం రోజుల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరినప్పటికీ రెండు రోజులు సమయం ఇస్తూ న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఎల్లుండికి వాయిదా వేశారు.