రేవంత్‌ జైలుకు

01

14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌,జూన్‌1(జనంసాక్షి): ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టారనే అభియోగాలతో అరెస్ట్‌ అయిన రేవంత్‌రెడ్డి సహా మరో నలుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ఏసీబీ అధికారులు నిందితులను చంచల్‌గూడా జైలుకు తరలించారు. జైలులో రేవంత్‌కు 1779 నంబర్‌ కేటాయించారు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు ఏసీబీ మెజిస్టేట్ర్‌కు అందజేసింది. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ లంచం ఇవ్వచూపారని అందువల్ల అతనిపై పీసీ యాక్ట్‌ కింద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. రేవంత్‌ సహా మరో ముగ్గురు పథకం ప్రకారం ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇచ్చారని వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అరెస్ట్‌ సమయంలో రేవంత్‌ వద్ద ఉన్న రూ.50 లక్షలను సీజ్‌ చేసినట్లు కోర్టుకు వివరించారు.  వ్యవహారంపై నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. టీడీపీకి ఓటు వేస్తే రూ.2 కోట్లు ఇస్తామని మొదట ముత్తయ్య స్టీఫెన్‌ను కలిశారు. ఆ తరువాత సెబాస్టియన్‌ రూ.5 కోట్లు ఆఫర్‌ చేశారు. రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలోనే ఈ వ్యవహారమంతా నడిచిందని ఏసీబీ అధికారులు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. డీల్‌ సమయంలో స్టీఫెన్‌ ఇంటి వద్ద నిఘా పట్టామని, స్టీఫెన్‌ ఇంటి నుంచి వీడియో ఫుటేజీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈకేసుకు ససంబందించి రేవంత్‌ సహా నలుగురిపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 120బీ, 34 ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 సెబాస్టియన్‌, ఏ3 ఉదయ్‌సింహా, ఏ4 ముత్తయ్యను చేర్చినట్లు ఏసీబీ తెలియజేసింది. అలాగే ఈ కేసులో మరిన్ని సాక్ష్యాలు సేకరించాల్సి ఉందని, రేవంత్‌రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్‌లో పేర్కొంది. లాలాగూడలోని స్టీఫెన్‌ బంధువు టేలర్‌ నివాసంలో ఆదివారం ఆయన్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. అర్థరాత్రి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం సోమవారం ఉదయం బంజారాహిల్స్‌లోని న్యాయమూర్తి నివాసానికి తరలించి ఆయన ముందు హాజరుపరిచారు. రేవంత్‌తో పాటు అరెస్టయిన సెబాస్టియన్‌, ఉదయ్‌సింహలను కూడా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. టీడీపీ క్రిస్టియన్‌ విభాగం నాయకుడు సెబాస్టియన్‌ హారీ, ఉదయ్‌, మాథ్యూస్‌ లను చంచల్‌ గూడ జైలుకు తరలించారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డితో పాటు వీరు ముగ్గురికి న్యాయమూర్తి 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. ఈ వ్యవహారంలో సెబాస్టియన్‌ హారీయే మధ్యవర్తి అని, ఆయనను ప్రశ్నిస్తామని ఏసీబీ వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్‌,జూన్‌1(ఆర్‌ఎన్‌ఎ):  టీడీపీ నేత రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాదుల వాదనలను విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. బెయిల్‌ పిటిషన్‌పై  కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. మరోవైపు రేవంత్‌ రెడ్డి తరపు న్యాయవాదులు …సిటీ సివిల్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు పంపించిన విషయం తెలిసిందే. దీంతో రేవంత్‌రెడ్డి అండర్‌ ట్రయల్‌ ఖైదీ నెంబరు 1779 అవతారమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వజూపిన కేసులో అరెస్టయిన రేవంత్‌రెడ్డిని కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలు సాంప్రదాయాల ప్రకారం రేవంత్‌రెడ్డిని జైలు అధికారులు పరిశీలించారు. అనంతరం అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఆయనకు 1779 నెంబరును కేటాయించారు. అనంతరం జైలులోని హై సెక్యూరిటీ బ్యారక్‌కు తరిలించారు.ముడుపుల కేసులో ఆయనను ఏసీబీ అధికారులు నిన్న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. రేవంత్‌ రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచగా, 14 రోజుల రిమాండ్‌ విధించారు. దాంతో ఆయనను సోమవారం  ఉదయం చంచల్‌గూల్గూడ జైలుకు తరలించారు.  కాగా అంతకు ముందు కోర్టు అనుమతితో రేవంత్‌ రెడ్డి  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు.