రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం
మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడి
కరీంనగర్,అక్టోబర్27(జనంసాక్షి): రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులకు త్వరలోనే సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అలాగే ధాన్యం కోనుగోళ్లకు పక్కాగా ఏర్పాట్లు చేశామని, మద్దతు ధరలు చెల్లించి కొంటామని అన్నారు. రైతులు దళారులను ఆవ్రయించి మోసపోవద్దన్నారు. జిల్లాలోని రంగాపూర్, సిరసపల్లి, వెంకట్రావుపల్లి, పోతిరెడ్డిపేట గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. వర్షాల వల్ల రైతులు దెబ్బతిన్నది వాస్తవమేనని అన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడవద్దని చెప్పారు. దళారులను నమ్మి మోస పోకూడదని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన 24 గంటల్లో మిల్లుకు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయన వెంట జెడ్పి చైర్ పర్సన్ విజయ, హుజురాబాద్ మార్కెట్ చైర్మన్ రమా, సింగిల్ విండో చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు, గ్రామ సర్పంచులు ఉన్నారు.