రైతుల ఆత్మహత్యలపై హైకోర్టు సిరియస్
– బలవన్మరణాలపై కారణాలు ఎందుకు అన్వేషించడం లేదు
– సర్కారుకు సూటి ప్రశ్న
హైదరాబాద్,,సెప్టెంబర్29(జనంసాక్షి):
రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ,ఎపిలలో రాజకీయ దుమారంగా మారుతున్న తరుణంలో హైకోర్టు అదే అంశంపై సీరియస్ అయ్యింది. ఆత్మహత్యలపై చైతన్య వేదిక వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించిది .ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చి సరిపెట్టుకోవడం సరికాదని, అది సరైన పరిష్కారం కాదని హైకోర్టు పేర్కొంది. ఆత్మహత్యలకు కారణాలను ఎందుకు అన్వేషించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. చనిపోయిన తర్వాత పరిహారం ఇస్తే ఏమి ప్రయోజనం అని, రైతును ముందుగా కాపాడుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వాలు ఏ చర్యలు చేపడుతున్నాయో తెలపాలని కోర్టు కోరింది. ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టలేరా అని తీవ్రంగా ప్రశ్నించింది. అక్టోబరు 13వ తేదీలోగా దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. వ్యాజ్యాన్ని అక్టోబర్ పదమూడు నాటికి వాయిదావేస్తూ రెండు రాష్ట్రాలు దీనికి సంబందించిన నివేదికలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.