రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి

భ‌ర్తా , చిన్నారులకు స్వల్ప గాయాలయ్యలు

వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని మిర్జామురాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృత్యువాత పడింది. బైక్‌పై ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్తలు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తండ్రికి, చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో తండ్రి ఆ చిన్నారులను అక్కున చేర్చుకుని, భార్య మృదేహాన్ని చూస్తూ, పెద్దపెట్టున రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. అలాగే పిల్లలతో ‘అటు చూడకండి.. అంతా అయిపోయింది’ అంటూ వెక్కివెక్కి ఏడవడం అందరినీ కలచివేసింది. మిర్జాపూర్ నివాసి జితేంద్ర తన భార్య సరోజ, ఇద్దరు పిల్లలను బైక్ మీద కూర్చోబెట్టుకుని, అనారోగ్యంతో ఉన్న అత్తను చూసేందుకు బయలు దేరాడు. దారిలో ఉన్నట్టుండి ఒక వాహనం వీరి బైక్‌ను బలంగా ఢీకొంది. దీంతో వెనుక కూర్చున్న భార్య రోడ్డు మీద పడిపోగా, ఆ వాహనం చక్రాలు ఆమె తలమీద నుంచి వెళ్లిపోయాయి. అదే సమయంలో జితేంద్ర, పిల్లలు దూరంగా ఎగిరి పడ్డారు. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు వీరిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుర్తు తెలియని వాహనం కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.