రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌కు సుమారు మూడు మీట‌ర్ల దూరంలో ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు

బెంగుళూరు జనం సాక్షి :  చంద్ర‌యాన్‌-3కి చెందిన రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్(Rover Pragyan) ప్ర‌స్తుతం మూన్‌పై వాక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ రోవ‌ర్ వెళ్తున్న దారిలో భారీ అగాధం ఎదురైంది. చంద్రుడి ఉప‌రిత‌లంపై దాదాపు నాలుగు మీట‌ర్ల విస్తీర్ణం ఉన్న‌ గొయ్యిని గుర్తించారు. దీంతో ప్ర‌జ్ఞాన్ రోవ‌ర్ రూటును మార్చేశారు. రోవ‌ర్‌కు ఉన్న నావిగేష‌న్ కెమెరాలు ఆగ‌స్టు 27వ తేదీన ఆ క్రాట‌ర్ ఫోటోను తీశాయి. ఆ ఫోటోను ఇవాళ ఇస్రో త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ గొయ్యి రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌కు సుమారు మూడు మీట‌ర్ల దూరంలో ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. దీంతో మ‌ళ్లీ రోవ‌ర్‌ను వెన‌క్కి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు ఆ రోవ‌ర్ కొత్త రూట్లో సుర‌క్షితంగా వెళ్తున్న‌ట్లు ఇస్రో పేర్కొన్న‌ది.రోవ‌ర్ ప్ర‌జ్ఞాన్‌కు లూనార్ డే పూర్తి కావ‌డానికి ఇంకా 10 రోజుల స‌మ‌యం ఉన్న‌ట్లు స్పేస్ అప్లికేష‌న్ష్ సెంట‌ర్‌(ఎస్ఏసీ) డైరెక్ట‌ర్ నిలేశ్ ఎం దేశాయ్ తెలిపారు. స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ద‌క్షిణ ద్రువంపై ఆరు చ‌క్రాలు ఉన్న ప్ర‌జ్ఞాన్ రోవ‌ర్ ను వీలైనంత దూరాన్ని క‌వ‌ర్ చేసే రీతిలో ప్రోగ్రామ్‌ను సెట్ చేసిన‌ట్లు ఆయ‌న వెల్లడించారు. ఆగ‌స్టు 23వ తేదీన చంద్ర‌యాన్‌-3కి చెందిన ల్యాండ‌ర్ విక్ర‌మ్ విజ‌య‌వంతంగా చంద్రుడిపై దిగిన విష‌యం తెలిసిందే.