లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి, నవంబర్2(జనంసాక్షి) : శుక్రవారం దలాల్ స్టీట్ర్లో బుల్ జోరు కొనసాగింది.. దీంతో దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. రూపాయి విలువ బలపడటం, బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఎనర్జీ, ఇన్ఫ్రా, మెటల్, ఫార్మారంగ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్ ఉదయం 300 పాయింట్లకు పైగా ట్రేడింగ్ ప్రారంభించింది. మరోవైపు నిఫ్టీ కూడా 80 పాయింట్ల వరకు లాభపడింది. లాభాలు అంతకంతకు పెరుగుతూనే పోయాయి. మధ్యాహ్న సమయానికి సెన్సెక్స్ ఓ దశలో 700 పాయింట్ల వరకూ లాభపడింది.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 579.68 పాయింట్ల లాభంతో 35011.65 వద్ద, నిఫ్టీ 172.55 పాయింట్ల లాభంతో 10553 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్క్యాప్ 92 పాయింట్లు లాభపడి 17,430 వద్ద ముగిసింది. ఇక డాలరుతో రూపాయి మారకం విలువ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా.. 94 పైసలు బలపడింది. దీంతో రూపాయి మారకం విలువ 72.52 వద్ద కొనసాగుతోంది. ఉదయం 73.45 వద్ద రూపాయి మారకం విలువ ప్రారంభమైంది. ఎన్ఎస్లో… వేదాంత (?6.46), మారుతి సుజుకీ (?6.27), బీపీసీఎల్ (?6.28), టాటా మోటార్స్ (?5.80), ఇండస్ ఇండ్ బ్యాంక్ (?5.25) షేర్లు అధికంగా లాభపడ్డాయి.
మరోవైపు టెక్ మహింద్రా (-4.26), విప్రో (-3.43), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (-1.57), సిఎ/-లా (-1.46), జీ ఎంటర్టెయిన్ మెంట్ (-1.35) షేర్లు ఎక్కువ నష్టాలను చవిచూశాయి.