లాయల్ టెక్స్‌టైల్స్ పరిశ్రమలో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం

నెల్లూరు జిల్లాలోని ఓ ప్రముఖ వస్త్ర తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరింది. కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్‌ ఇంజిన్లు వచ్చినప్పటికీ మంటలు ఆర్పేందుకు చాలా సమయం తీసుకున్నారు. దాంతో పెద్ద మొత్తంలో వస్త్రాలు, యంత్రాలు బూడిదైపోయాయి. ఈ ఘటప నాయుడుపేట మండలం మేనకూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని లాయల్ టెక్స్‌టైల్స్ పరిశ్రమలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుననది.

అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మేనకూరు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో లాయల్‌ వస్త్ర తయారీ పరిశ్రమలో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో కార్మికులు ప్రాణాలు అరచేత పట్టుకుని బయటకు పరుగులు తీశారు. పరిశ్రమ ప్రతినిధులు వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ ఇంచార్జి అధికారి చలమయ్య ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, కోట తదితర ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను రప్పించారు. పరిశ్రమలోని పత్తి గోదాంతోపాటు వస్త్రాలు నిల్వచేసి గోదాముల్లో మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున నష్టం ఏర్పడింది. సీఐ సోమయ్య, ఎస్‌ఐలు రాత్రంతా సహాయక చర్యల్లో మునిగిపోయారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.