లూధియానాలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేత దారుణ హత్య

న్యూఢిల్లీ,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): రాష్టీయ్ర స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) నాయకుడు రవీందర్‌ గోసాయ్‌ (58) దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం లూథియానాలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆయనను కాల్చి చంపారు. పెంపుడు కుక్కను తీసుకుని ఉదయం ఆయన ఇంటినుంచి బయటికి రాగానే దుండగులు కాపుకాచి ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. మెడ, వీపుపై బుల్లెట్లు దూసుకుపోవడంతో ఘటనాస్థలంలోనే రవీందర్‌ కుప్పకూలిపోయారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. లూథియానా ఆరెస్సెస్‌లోని రఘునాథ్‌ నగర్‌ మోహన్‌ శాఖకు రవీందర్‌ నేతృత్వం వహిస్తున్నారు. బీజేపీ జిల్లా ఆఫీస్‌ బేరర్‌గానూ పనిచేస్తున్నారు. ఆయన హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మరోవైపు రవీందర్‌ హత్య విషయం తెలుసుకున్న బీజేపీ, ఆరెస్సెస్‌ నాయకులు పెద్దఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు.