వరంగల్‌ బస్సు డిపోలో అగ్ని ప్రమాదం

– ఐదు బస్సులు దగ్దం
– విచారణకు ఆదేశించిన మంత్రి మహేందర్‌రెడ్డి
వరంగల్‌, ఆగస్టు2(జ‌నం సాక్షి) : వరంగల్‌లోని ఆర్టీసీ డిపో-1లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఐదు బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో మూడు ఇంద్ర బస్సులు పూర్తిగా దగ్దం కాగా, రెండు పల్లెవెలుగు బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తొలుత ఇంద్ర ఏసీ బస్సులో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొదట ఏపీ 29 జెడ్‌ 3368 ఇంద్ర బస్సులో మంటలు చెలరేగి పక్కనే ఉన్న బస్సులకు వ్యాపించాయి. దాదాపు రెండు నెలల కిందట బ్రేక్‌డౌన్‌ కావడంతో ఈ బస్సును డిపోలో పార్కింగ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు. దాని బ్యాటరీ మార్చి అక్కడ నుంచి తీస్తున్న సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి. ఇవి పక్కనే ఉన్న బస్సులకు మంటలు అంటుకోవడంతో మూడు ఏసీ బస్సులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. దీని గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. డిపోలో మిగతా బస్సులకు
మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే ప్రమాద తీవ్రత అధికంగా ఉండేది. ఈ అగ్ని ప్రమాదం ఘటనపై మంత్రి మహేందర్‌ రెడ్డి ఆరా తీశారు. వెంటనే విచారణకు ఆదేశించిన ఆయన, ఇలాంటివి పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ-1 డిపో పరిధిలో తరుచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోవడంతో పోలీసులు సైతం దీనిపై కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు ముందు రోజే ఆర్టీసీ-1 డిపో ముందు భాగంలో ఉన్న ఏఎన్‌ఎల్‌ పార్సిల్‌ సర్వీసులోనూ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పార్సిల్‌ ఆఫీసులోని కీలకమైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదాలకు షార్ట్‌ సర్క్యూటే కారణమా? ఏవరైనా కావాలనే నిప్పంటిచారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  మరోవైపు అగ్నిప్రమాద స్థలాన్ని ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రాజధాని బస్సును సూపర్‌ లగ్జరీగా మారుస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఐదు బస్సులు దగ్ధమవగా, మూడు బస్సులు పాక్షికంగా దగ్ధమైనట్లు చెప్పారు. వర్షం సమయంలో బ్యాటరీలు అమర్చడం ప్రమాదానికి కారణం కావచ్చని సోమారపు సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం వల్ల సుమారు 50లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.