వరదబాధితులకు సీతక్క ఆపన్నహస్తం

వృధ్ధులకు స్వెట్టర్లు, దుస్తులు పంపిణీ
పలుచోట్ల బాధితులకు ఆహార పదార్థాలు అందచేత

ములుగు,జూలై14(జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డులు, పలు కాలనీలు, వంతెనలపై నీరు చేరింది. పలు చోట్లు వర్షాలు, వరదల కారణంగా ఎంతోమంది పేదలు నానా అవస్థలు పడుతున్నారు. ములుగు జిల్లాలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమై పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే.. కొన్ని చోట్ల ఉన్న వంతెనలు కూలిపోయే దుస్ధితికి చేరడంతో.. గిరిజనులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వానలకు కురుస్తుండటంతో.. బయటకు వెళ్లే పరిస్థితి లేక చెప్పలేని తిప్పలు పడుతున్నారు. ఈ దశలో వరద బాధితులకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే సీతక్క భరోసా ఇచ్చారు. చలితో వణుకుతున్న వృద్ధులకు స్వెట్టర్లు, వర్షంలో తడవకుండా ఉండేందుకు రెయిన్‌ కోట్లు, కొప్పెర్లు పంపిణీ చేశారు. బట్టలు, కూరగాయలు ఇచ్చారు. చాలామందికి ఇండ్లు కూలిపోయాయని ప్రభుత్వం పట్టించుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు. కూలిపోయే దశలో ఉన్న కొండాయి బ్రిడ్జిని దాటి, అవతలి గ్రామాలకు వెళ్లారు. వానలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. వానలకు ఇళ్లు ధ్వంసం అయిన వారికి సాయం చేసి, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. వర్షాలు తగ్గేవరకు బయటకు రావద్దని.. ఎలాంటి సాయం కావాలన్నా తనను, స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. వానలకు పలు గ్రామాల్లో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయని.. స్థానిక నాయకులు బాధితులను ఆదుకోవాలని కోరారు. పలు ఇళ్లు కూలేందుకు సిద్దంగా

ఉండటంతో వారికి సాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. బాధితులకు సాయం అందేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే సీతక్క చెప్పారు. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఎమ్మెల్యే సీతక్క ధైర్యం చెప్పారు.