వరి పంటను పరిశీలించిన మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు

మంథని, (జనంసాక్షి) : మల్లారెడ్డి విశ్వవిద్యాలయానికి చెందిన అగ్రికల్చర్ బీఎస్సీ చివరి సంవత్సరం విద్యార్థులు నాగారం గ్రామంలో మూడు నెలల పాటు ఉండి క్షేత్రస్థాయి వ్యవసాయ విధానాలు పరిశీలన నిమిత్తం రావడం జరిగింది. ఇందులో భాగంగా మంగళవారం నాగారం గ్రామపంచాయతీ పరిధిలోగల కమ్యూనిటీ హాల్ లో గ్రామ సర్పంచ్ బూడిద మల్లేష్ అధ్యక్షతన కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి ఖిల్లా ప్రధాన శాస్త్రవేత్త ఏ. శ్రీనివాస్, ఇతర శాస్త్రవేత్తలు వినోద్ కుమార్,కిరణ్, నవ్య, కిరణ్ కుమార్ పర్యవేక్షణలో పిఆర్ఏ (పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్) కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వెన్ డయాగ్రమ్ ద్వారా గ్రామంలోని వ్యవసాయ పరిస్థితులు జలవనరులు, నేల రకాలు, పంటలు మొదలైన విషయాలను వివరంగా తెలపారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారు గ్రామంలోని వ్యవసాయ పొలాల యొక్క భూసార పరీక్షలు నిర్వహించాలని శాస్త్రవేత్తలను కోరారు. రైతులు వారి యొక్క పొలంలోని మట్టిని తమకు అందజేసినట్లయితే భూసార పరీక్షలు నిర్వహించి రిపోర్టు అందజేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు .అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఫీల్డ్ విజిట్ లో భాగంగా బూడిద జైపాల్ వ్యవసాయ పొలాన్ని సందర్శించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వార్డు సభ్యులు దాసరితార, తోకల శైలజ, పంచాయతీ కార్యదర్శి అనిల్, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.