వస్త్రరంగంలోకి ప్రవేశించిన పతంజలి
పతంజలి పరిధాన్ పేరిటి జీన్సు విడుదల
న్యూఢిల్లీ,నవంబర్5(జనంసాక్షి): వ్యాపారరంగంలో దూసుకుని పోతున్న పతంజలి సంస్థ ఇప్పుడు వస్త్ర రంగంలోనూ కెరటంలా దూసుకుని వచ్చింది. గతంలో ప్రకటించిన మేరకు పతంజలి జీన్ను విడదుల చేసింది. ఇప్పటికే నిత్యావసర సరకులు.. ఇతర ఆహార, ఆరోగ్య ఉత్పత్తుల రంగంలోకి అడుగు పెట్టి అనతికాలంలోనే పతంజలి సంస్థ వృద్ధిని నమోదు చేసింది. స్వదేశీ సంప్రదాయాలకు అనుగుణంగా తమ సంస్థ నుంచి పతంజలి పరిధాన్ పేరుతో దుస్తులను విక్రయించనున్నట్లు గతంలోనే ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ప్రకటించారు. ఇప్పుడు దేశ రాజధాని దిల్లీలో ‘పతంజలి పరిధాన్’ పేరిట యాక్సెసరీస్
స్టోర్ను సోమవారం ప్రారంభించారు. ధనత్రయోదశి, దీపావళి పండుగల సందర్భంగా పరిధాన్ జీన్స్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు రాందేవ్ బాబా తెలిపారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా 200 పతంజలి పరిధాన్ స్టోర్స్ను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ స్టోర్లో మహిళలు, పురుషులు, చిన్నారులకు రకరకాల దుస్తులు లభించనున్నాయి. అంతేకాదు.. తొలి వస్త్రదుకాణాన్ని తెరిచినందుకు గాను పతంజలి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ధనత్రయోదశి నుంచి ఐదు రోజుల పాటు 25శాతం డిస్కౌంట్ కింద వస్త్రాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇక పతంజలి జీన్స్ రూ.500కే లభిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. రూ.2500 బ్రాండెడ్ షర్ట్స్ రూ.500కే ఇస్తున్నట్లు తెలిపారు. పండుగ సీజన్ పురస్కరించుకొని ఒక జీన్స్, రెండు టీ షర్టులను(రూ.7000 విలువ చేసే) కేవలం రూ.1100కే ఇస్తున్నట్లు తెలిపారు. దేశాన్ని దోచుకుంటున్న మల్టీ నేషనల్ కంపెనీలను నియంత్రించేందుకు స్వదేశీ వస్త్రాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా రాందేవ్ బాబా వెల్లడించారు. పతంజలి పరిధాన్ కింద మూడు బ్రాండ్స్ను విడుదల చేశారు. ‘ఆస్థా’, ‘సంస్కార్’, ‘లైవ్ ఫిట్’ బ్రాండ్స్ కింద దాదాపు 3500 రకాల వస్త్రాలు, షూస్, యాక్సెసరీస్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.