వామపక్ష పార్టీల కీలక సమావేశం.. వచ్చే ఎన్నికలపై సంచలన నిర్ణయం

వామపక్ష పార్టీల కీలక సమావేశం.. వచ్చే ఎన్నికలపై సంచలన నిర్ణయం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి.

అయితే ఏయే స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే అంశాన్ని తేల్చేందుకు అక్టోబర్ 1వ తేదీన సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సీపీఐ, సీపీఎం పార్టీలు ప్రకటన చేశాయి. గురువారం రోజున హైదరాబాద్‌లో ఎంబీ భవన్‌లో సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించారు. ఇక రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమావేశంలో.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరలు పాల్గొన్నారు. ఆ తర్వాత తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

కేంద్రంలో బీజేపీకి సహకరించే విధంగా బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలు ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్‌ ఇండియా కూటమిలో చేరకుండా పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇచ్చేలా కొత్త ఫ్రంట్‌ను తీసుకొచ్చారంటూ ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీలు బీజేపీ గద్దే దించేందుకే పనిచేస్తాయని తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసే పోటీ చేస్తాయని, ప్రజా సమస్యలపై పోరాటం ఎప్పటికీ ఆగదంటూ పేర్కొన్నారు. అయితే దేశంలో వివిధ రాష్ట్రాల్లో మజ్లిస్‌ పార్టీ ఉద్దేశపూర్వకంగా పోటీచేస్తూ.. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీలుస్తోందంటూ వ్యాఖ్యానించారు. మహిళలను ఉద్ధరించే ఉద్దేశం ప్రధాని మోదీ ప్రభుత్వానికి లేదంటూ ఆరోపింటారు. రానున్న ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ బిల్లు తీసుకొచ్చారంటూ విమర్శలు చేశారు.

ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు అంశంపై చర్చలు రాలేవని కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆ పార్టీతో పొత్తు వద్దనే ఆలోచన తమకు లేదని పేర్కొన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసే పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. అయితే సీట్ల పంపకం విషయంలో త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక మజ్లిస్‌ పార్టీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మొదటి నుంచి సఖ్యత ఉందని తెలిపారు. అయితే సమైక్యతా దినోత్సవమంటే ఏమిటో మజ్లిస్, కేసీఆర్‌ సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. అయితే ప్రజలను మోసం చేసే విషయంలో బీజేపీ ఆరితేరిపోయినట్లు పేర్కొన్నారు. అంతేకాదు రాజ్యాంగ పీఠిక నుంచి సామ్యవాదం, లౌకికవాదం పదాలను తొలగించడం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఎన్నికల వ్యూహాలపై కసరత్తులు చేస్తున్నారు అధికార, విపక్ష నాయకులు.