వింటా నందాపై పరువు నష్టం
చర్యలకు దిగిన నటుడు అలోక్నాథ్
ముంబై,అక్టోబర్13(జనంసాక్షి): విూటూ..లో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్నాథ్ చట్టపరమైన చర్యలకు రెడీ అయ్యారు. తనపై సంచలన ఆరోపణలు చేసిన నిర్మాత, రచయిత వింటా నందాపై పరువు నష్టం కేసు వేశారు. అలోక్ నాథ్ తరఫున ఆయన భార్య అషు కేసు వేశారు. తన భర్తపై ఆరోపణలు చేయడం ద్వారా పేరు పొందాలని వింటా నందా చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమెరికాలో ప్రారంభమైన విూ టూ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకునే వింటా.. తన భర్త లక్ష్యంగా ఈ ఆరోపణలు చేశారని ఆరోపించారు. తన భర్తను మాత్రమేగాక.. తనపై కూడా ఆరోపణలు చేయడం ద్వారా తమ పరువుకు భంగం కలిగించారని తెలిపారు. 19 ఏళ్ల కిందట అలోక్ నాథ్ తనను బలవంతం చేశాడంటూ సోషల్ విూడియా వేదికగా వింటా నందా ఆరోపణలు చేసింది. నానా పటేకర్పై నటి తనుశ్రీ దత్త ఆరోపణలు చేయడంతో ప్రారంభమైన ఈ విూటూ ఉద్యమం… ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేంద్రమంతి ఎంజే అక్బర్, బాలీవుడ్ దర్శకులు వికాస్ భల్, సాజిద్ఖాన్, రచయిత చేతన్ భగత్, సీనీ గేయ రచయిత వైరముత్తు, సింగర్లు కైలాశ్ ఖేర్, కార్తీక్, రఘుదీక్షిత్ లాంటి ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఉన్నారు.