వృధా ప్రయాస

1

– ఎన్ని చేసినా తెలంగాణలో టీడీపీ బతకదు

– ఎర్రబెల్లి

వరంగల్‌,ఫిబ్రవరి 27(జనంసాక్షి): తెలంగాణలో టీడీపీ బతకదని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా చేతులెత్తేశాడని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. ఎర్రబెల్లి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆనంతరం తొలిసారిగా శనివారం వరంగల్‌ జిల్లా పాలకుర్తికి వచ్చిన సందర్భంగా స్థానిక రాజీవ్‌ చౌరస్తాలో పార్టీ జెండా ఆవిష్కరించి కార్యకర్తలను ఉద్థేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో, నారాయణఖేడ్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్‌ కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, తెలంగాణలో టీడీపీ నేతలు కార్యకర్తలు దీనిపై ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాలకుర్తి నియోజక వర్గ అభివృద్ధితో పాటు బంగారు తెలంగాణలో భాగస్వామిని కావడానికే టీఆర్‌ఎస్‌లో చేరానని ఎర్రబెల్లి గుర్తు చేశారు. ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలు వమ్ము చేయనని, ఆరు నెలల్లో పాలకుర్తిలో అభివృద్ధిని చూపిస్తానన్నారు. నియోజక వర్గంలోని చెరువులను గోదావరి, ఎస్సారెస్పీ జలాలతో నింపుతానన్నారు. వరంగల్‌ జిల్లాలో అన్ని నియోజక వర్గాలకంటే పాలకుర్తి నియోజక వర్గానికి అధిక నిధులు తీసుకోస్తానని, డిగ్రీ, జూనియర్‌ కళాశాల మంజూరుతో పాటు దవాఖానను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని హావిూ ఇచ్చారు. పాలకుర్తిలోని సోమేశ్వరుడి గుట్ట, బమ్మెర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతానని చెప్పారు.