వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ఆటోప్రమాదంలో మరో టెన్త్‌ విద్యార్థి మరణం
కడప,మార్చి26(జ‌నంసాక్షి): వేర్వేరు ప్రమాదాలల్‌ఓ ఓ టెన్త్‌ విద్యార్థి సహా మరొకరు మృతి చెందారు. కమలాపురం మండలం నేటపల్లి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుడు యర్రబల్లి కొత్తపల్లికి చెందిన విష్ణు వర్థన్‌రెడ్డి (16) గా గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. పదవ తరగతి పరీక్షలు రాసేందుకు విద్యార్థులు కమలాపురానికి చెందిన ఆటోలో పరీక్షా కేంద్రానికి బయలుదేరారని తెలిపారు. నేటపల్లి వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుందన్నారు. గమనించిన స్థానికులు హుటాహుటిన గాయపడిన విద్యార్థులను, ఆటో డ్రైవర్‌ను కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. గాయపడిన ఆటో డ్రైవర్‌ రాయుడు (40), నవ్యశ్రీ (13), కిషోర్‌ (8), వీరు యర్రబల్లి కొత్తపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదిలావుంటే రైల్వే కోడూరు మండలంలోని మాధవరంపోడు వద్ద కడప-తిరుపతి జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కడప-తిరుపతి జాతీయ రహదారిపై వెళుతున్న బైకును లగేజీ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో శెట్టిగుంటకు చెందిన సతీష్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.