వేలానికి మాల్యా కార్లు
ముంబయి: మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా కార్లను వేలం వేయనున్నారు. ఇటీవల మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ హౌస్, ఇతర ఆస్తులు వేలం వేయగా కొనడానికి ఒక్కరు కూడా ముందుకు రాని సంగతి తెలిసిందే. తాజాగా ఎస్బీఐకాప్ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ మాల్యా, ఆయన కంపెనీకి చెందిన 8 కార్లను వేలం వేయడానికి సిద్ధమైంది. ఆగస్టు 25న కార్లు వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. రూ.13.70లక్షలకు ఈ కార్లు వేలం వేస్తున్నారు.
ప్రస్తుతం ఈ కార్లు కింగ్ఫిషర్ హౌస్ ప్రాంగణంలో ఉన్నాయి. వేలంలో పాల్గొనాలని అనుకునేవారు ప్రతి కారుకు కోట్ చేసిన ధరలో పది శాతం డిపాజిట్ చేయాలి. వేలానికి దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 23న ముగుస్తుందని ఎస్బీఐ తెలిపింది. కార్లను జులై 29, ఆగస్టు 5వ తేదీల్లో పరిశీలించుకోవచ్చు. మాల్యా బ్యాంకులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలు చెల్లించకుండా ప్రస్తుతం లండన్లో ఉంటున్న సంగతి తెలిసిందే.