వేసవి మహా విపత్తు
తెలంగాణలో వడదెబ్బకు 500 మృతులు
హైదరాబాద్,మే29(జనంసాక్షి): తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. సూర్య ప్రతాపానికి తాళలేక రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది ప్రాణాలను కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం పది జిల్లాల వ్యాప్తంగా గురువారం వరకు 486 మంది మరణించారు. శుక్రవారం సాయంత్రం వరకు 24 మంది మృతితో కలుపుకుని మొత్తం 510 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అత్యధికంగా నల్గొండలో 126 మంది ప్రాణాలు కోల్పోయారు. కరీంనగర్లో 95, ఖమ్మంలో 92 మంది మృతిచెందారు .తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు మంట పుట్టిస్తున్నాయి. వడదెబ్బ మృతులు పెరుగుతూనే ఉన్నారు. ఎండ వేడిమికి ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. వడదెబ్బతో శుక్రవారం తెలంగాణలో 24 మంది మృతిచెందారు. మెదక్ జిల్లాలో ఐదుగురు, నల్గొండ జిల్లాలో ఐదుగురు, కరీంనగర్ జిల్లాలో నలుగురు, ఆదిలాబాద్లో ఇద్దరు, వరంగల్ జిల్లాలో ఇద్దరు, నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు, మహబూబ్నగర్ జిల్లాలో ఇద్దరు మృతిచెందారు. రోహిణి కార్తె కారణంగా ఎండలు మండిపోతోన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి.